సౌతాఫ్రికాతో రెండు టెస్ట్ల సిరీస్ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. కోల్కతా వేదికగా ఆదివారం ముగిసిన తొలి టెస్ట్లో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తు చేసింది. రెండున్నర రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగియడంతో పిచ్పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా బౌలింగ్కు అనుకూలంగా ఉన్న వికెట్ను తయారు చేయడం ఏంటని మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీమిండియా మేనేజ్మెంట్ సమతూకమైన పిచ్ను కోరినా.. కోల్కతా పిచ్ క్యూరెటర్ అందుకు భిన్నమైన వికెట్ ఇచ్చారని మండిపడుతున్నారు. అయితే ఈ విమర్శలను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తప్పుబట్టాడు. ఇందులో పిచ్ క్యూరేటర్ తప్పు లేదని, టీమిండియా కోరుకున్నట్లుగానే పిచ్ తయారు చేశామని తెలిపాడు.

'టీమిండియా మేనేజ్మెంట్ కోరిన విధంగానే పిచ్ను రూపొందించాం. పిచ్పై మ్యాచ్కు ముందు నాలుగు రోజులుగా వాటరింగ్ చేయలేదు. అందుకే అది ఇలా బ్యాటింగ్కు ప్రతికూలంగా మారింది. ఈ విషయంలో పిచ్ క్యురేటర్ ముఖర్జీని తప్పుపట్టలేం'అని గంగూలీ స్పష్టం చేశాడు.
మ్యాచ్ అనంతరం టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. తాము కోరినట్లుగానే పిచ్ తయారు చేశారని, కానీ తామే అందుకు తగినట్లు ఆడలేకపోయామని అంగీకరించాడు. ఈ మ్యాచ్ ఆరంభం నుంచి పిచ్ పూర్తిగా బౌలింగ్కు అనుకూలించింది. తొలి రోజు ఆటలో 11 వికెట్లు పడితే.. రెండో రోజు ఆటలో 16 వికెట్లు పడ్డాయి. మూడో రోజు ఆట సెషన్నరలోనే 12 వికెట్లు పడ్డాయి. న్యూజిలాండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో స్పిన్ బౌలింగ్ ఆడలేకనే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. మరోసారి స్పిన్ బౌలింగ్కే బలైంది.
93/7 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ టెంబా బవుమా(136 బంతుల్లో 4 ఫోర్లతో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా కార్బిన్ బోష్(37 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 25) రాణించాడు. ఈ ఇద్దరూ 8వ వికెట్కు 44 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ భాగస్వామ్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.
124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 93 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్(92 బంతుల్లో 2 ఫోర్లతో 31) టాప్ స్కోరర్గా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.