
కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ గురువారం తన 49వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. కోల్కతాలోని తన కార్యాలయంలో కేక్ కట్ చేశాడు. తన సహోద్యోగులు ఏర్పాటు చేసిన ఈ కేక్ కట్టింగ్ సెలెబ్రేషన్స్లో పాల్గొన్న దాదా చిరునవ్వులు చిందుస్తూ కేక్ కట్ చేశాడు. అనంతరం మీడియాతో సరదాగా మాట్లాడాడు. ఈ సందర్భంగా క్రికెట్, యూరో, కోపా అమెరికా ఫుట్బాల్, ఒలింపిక్స్కు సంబంధించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
కరోనా కారణంగా తన బర్త్డేను చాలా సింపుల్గా జరుపుకున్నట్లు దాదా తెలిపాడు. అనుకోకుండా ఏర్పాటు చేసిన కార్యక్రమమేన, ప్రీ ప్లాన్ కాదన్నాడు. 55 ఏళ్ల తర్వాత యూరోలో ఇంగ్లండ్ ఫైనల్కు వచ్చిందని, తనకు సంతోషంగా ఉందన్నాడు. ఇక కోపా అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనా మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు. తన సపోర్ట్ ఎప్పుడూ బ్రెజిల్కే ఉంటుందని గంగూలీ తెలిపాడు. ఒలింపిక్స్కు వెళ్తున్న భారత అథ్లెట్లు ఈసారి చాలా మెడల్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. ఇక తన ఆరోగ్యం గురించి ఓ రిపోర్టర్ ఆరా తీయగా ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపారు. ఇటీవలే దాదాకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే.
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాదా ఇంటికి వెళ్లి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గంగూలీ నివాసంలో కొద్దిసేపున్న మమతా.. అతనితో సరదాగా మాట్లాడారు. ఇక దాదాకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు గంగూలీకి విషెస్ తెలియజేశారు. భారత్ తరఫున 113 టెస్ట్లు, 311 వన్డేలు ఆడిన దాదా.. రెండు ఫార్మాట్లలో కలిపి 18,575 రన్స్ చేశాడు. మొత్తం 195 మ్యాచ్లకు సారథ్యం వహించిన దాదా.. 97 మ్యాచ్ల్లో విజయాలందించాడు.