
దారుణంగా విఫలమవ్వడంతో..
ఇక ఎన్నో అంచనాలతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి 43 (టెస్ట్లో 31, టీ20ల్లో1, 11) పరుగులే చేశాడు. దాంతో కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని కపిల్ దేవ్ వంటి దిగ్గజ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. దాంతో విరాట్కు మద్దతుగా మరికొంత మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు. ఇప్పటికే గవాస్కర్, శరణ్ దీప్ సింగ్.. కోహ్లీని వెనుకేసుకురాగా ఆ జాబితాలో దాదా కూడా చేరాడు. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా.. కోహ్లీ పేలవ ఫామ్పై మాట్లాడాడు. అతి త్వరలోనే అతను మునపటి లయను అందుకుంటాడని తెలిపాడు.

కోహ్లీ పరుగులను చూడండి...
'అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ చేసిన పరుగులను చూస్తేనే అతని సత్తా, సామర్థ్యం ఏంటో అర్థమవుతోంది. అవి లేకుండా అన్ని పరుగులు చేయడం అసాధ్యం. కొద్ది రోజులుగా అతను గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయం అతనికి కూడా తెలుసు. విరాట్ గొప్ప ఆటగాడు. తన సామర్థ్యానికి తగినట్లు ఆడటం లేదని, ఇది తనకు ఏ మాత్రం మంచిది కాదనే విషయం కోహ్లీకి తెలుసు. అతి త్వరలోనే అతను మునపటి లయను అందుకోవడం మనం చూస్తాం. అయితే అతను దానికి అనుగుణమైన మార్గాన్ని కనుగొనాలి. గత 12-13 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న అతనికి ఇది ఏం పెద్ద కష్టమైన పనికాదు.

రోహిత్ శర్మ సైతం..
కోహ్లీని తప్పించాలంటూ కపిల్ దేవ్ చేసిన వ్యాఖ్యలను కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తప్పుబట్టాడు. 'టీమిండియా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో మేము పట్టించుకోవడం లేదు. అసలు క్రికెట్ ఎక్స్పర్ట్స్ ఎవరో నాకు తెలియదు. వారిని ఎందుకు అలా పిలుస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. వారు బయట నుంచి చూస్తున్నారు. టీమిండియాలో ఏమి జరుగుతుందో వారికి తెలియదు. మేము ప్రపంచకప్ లక్ష్యంగా ఒక జట్టును తయారు చేసుకొంటున్నాం. అనేకసార్లు చర్చించిన తర్వాతే మార్పులపై నిర్ణయాలు తీసుకుంటున్నాము. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తున్నాము. ఈ విషయాలన్నీ బయట వారికి తెలియవు.'అని క్రికెట్ విమర్శకుల ప్రశ్నలకు రోహిత్ సమాధానమిచ్చాడు.

ఫామ్ కోల్పోవడం సహజం..
క్రీడల్లో ఓ ఆటగాడు ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడం సహజం. ప్రతీ ఒక్కరికి ఇలాంటి విషమ దశ ఉంటుంది. నాతో పాటు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ కూడా ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా ఫేస్ చేస్తున్నాడు. భవిష్యత్తులో మరికొంత మంది ఆటగాళ్లు కూడా ఈ ఇబ్బందులు పడుతారు. ఇది ఆటలో భాగమే. నా అభిప్రాయం ప్రకారం ఓ క్రీడాకారుడి అన్ని విషయాలు, విమర్శలు వినాలి. అందులో సరైనది ఏది తెలుసుకోవాలి. మన ఆట ఆడాలి'అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications
