ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ రాణించడంపైనే టీమిండియా టైటిల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ అన్నాడు. భారత గడ్డపై మెగా టోర్నీ జరుగుతుండటంతో స్పిన్నర్లు కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో వరుణ్ చక్రవర్తీనే ఎక్స్ ఫ్యాక్టర్ ఆటగాడని తెలిపాడు. మెగా టోర్నీకి టీమిండియా బాగా సన్నదమవుతుందని చెప్పాడు.
ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచకప్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీ బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. వరుణ్ చక్రవర్తీతో పాటు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లతో మొత్తం నలుగురు స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా మెగా టోర్నీలో ఆడనుంది. తాజాగా ఓ వార్త సంస్థతో మాట్లాడిన గంగూలీ.. వరుణ్ చక్రవర్తీపై ప్రశంసల జల్లు కురిపించాడు.

'సొంతగడ్డపై జరిగే వరల్డ్ కప్ కంటే గొప్పది మరొకటి ఉండదు. ఎప్పటికీ భారత జట్టే నా ఫేవరేట్ టీమ్. భారత్కు బలమైన స్పిన్ అటాక్ ఉంది. వరుణ్ చక్రవర్తీ ఫిట్గా ఉండి రాణిస్తే భారత్కు తిరుగుండదు.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు. భారత్, శ్రీలంకలో పిచ్ కండిషన్స్ స్పిన్కు అనుకూలంగా ఉండనున్నాయి. దాంతోనే జట్లన్నీ స్పిన్ విభాగాన్ని పటిష్టం చేసుకున్నాయి.
ఇప్పటి వరకు భారత్ తరఫున 22 టీ20లు ఆడిన వరుణ్ చక్రవర్తీ 51 వికెట్లు తీసాడు. సౌతాఫ్రికాతో ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లోనూ సత్తా చాటాడు. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో అతను 6 వికెట్లు పడగొట్టాడు. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లను కట్టడి చేయడం వరుణ్ చక్రవర్తీ స్పెషాలిటీ. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ల్లో అతను కీలకం కానున్నాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముందు టీమిండియా న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. జనవరి 21 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. హోమ్ కండిషన్స్లో ఆడుతుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశమని, వరుణ్ చక్రవర్తీ రాణించడంపై భారత విజయవకాశాలు ఉంటాయని గంగూలీ జోస్యం చెప్పాడు.