ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా విజయంతో ముగించింది. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో అసాధారణ ప్రదర్శన కనబర్చిన టీమిండియా 2-2తో సిరీస్ను సమం చేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ రిటైర్మెంట్ అనంతరం బరిలోకి దిగిన తొలి సిరీస్లోనే టీమిండియా అద్వితీయమైన ప్రదర్శన చేసింది. నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ తన శకాన్ని ఘనంగా ప్రారంభించాడు. ఈ సిరీస్లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించింది. కానీ నెంబర్ 3 స్థానం నుంచి మాత్రం ఆశించిన పరుగులు రాలేదు. ఈ స్థానంలో ఆడించిన కరుణ్ నాయర్, సాయి సుదర్శన్లు ఒక్కో హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశారు. దాంతో శ్రేయస్ అయ్యర్ను ఈ స్థానంలో ఆడించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కానీ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం అభిమన్యు ఈశ్వరన్ను ఈ స్థానంలో ఆడించాలని సూచించాడు.
ఇంగ్లండ్ పర్యటనలో అతనికి ఒక్క మ్యాచ్లో అవకాశం దక్కలేదు. అంతకుముందు ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా అతను బెంచ్కే పరిమితమయ్యాడు. దాంతో అతను ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయలేదు. ఈ క్రమంలోనే మూడో స్థానంలో అభిమన్యు ఈశ్వరన్కు ఒక అవకాశం ఇవ్వాలని గంగూలీ సూచించాడు. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు లోటుగా కనిపించిన స్థానం ఇది మాత్రమేనని చెప్పాడు.

'అభిమన్యు ఈశ్వరన్కు ఇంకా చాలా వయసు ఉంది. అతనికి అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా పరుగులు రాబట్టారు. కానీ నెంబర్ 3 బ్యాటర్ మాత్రం రాణించలేకపోయాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఇదే లోటుగా కనిపించింది. బహుషా ఈ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ను ప్రయత్నించవచ్చు.'అని సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.
తన కొడుకు అరంగేట్రంపై గంభీర్ హామీ ఇచ్చాడని అభిమన్యు ఈశ్వరన్ తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ ఇటీవల మీడియాకు తెలిపాడు. 'నా కుమారుడితో గంభీర్ మాట్లాడాడు. సరైన దారిలో ఉన్నావని, తప్పకుండా ఆడే అవకాశం వస్తుందని భరోసా ఇచ్చాడు. కేవలం ఒకటి, రెండు మ్యాచ్లకే బయటకు పంపించే వ్యక్తిని కాదని గంభీర్ మా అబ్బాయికి చెప్పాడు. గంభీర్ చెప్పిన విషయాలను అభిమన్యు నాతో పంచుకున్నాడు. భవిష్యత్తులో టీమిండియాకు మరింత కాలం ఆడేలా కోచింగ్ విభాగం అండగా నిలుస్తుందని ఆ మాటలను బట్టి అర్థమైంది. గత నాలుగేళ్లుగా నా కుమారుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.'అని రంగనాథన్ తెలిపారు.