

ముంబై: దేశంలో కరోనా(కోవిడ్-19) కేసులు రోజు రోజుకు పెరుగుతున్నా ఐపీఎల్ నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. ఇప్పటికే పలుమార్లు ఈ విషయాన్ని తెలిపిన దాదా... తాజాగా మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే చేసిన వ్యాఖ్యలపై స్పందించాడు.
ఈనెల 29న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్కు తెరలేవనుంది. ఇక వాంఖడే మైదానంలో మొత్తం ఏడు మ్యాచ్లు జరగనున్నాయి.
ప్రస్తుతం భారత్లో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 42 కేసులు నమోదయ్యాయి. తమ రాష్ట్రంలో 15 మంది అనుమానితులను వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని, మరో 258 మందిని పంపించినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో ఒక్కరికి కూడా వైరస్ సోకినట్లు తేలలేదని స్పష్టం చేసింది.
ఇటీవల ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడితే.. వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. దీంతో ఐపీఎల్ వాయిదా వేయాలని, ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్చిస్తుందని, త్వరలోనే తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో గంగూలీ సోమవారం ఇండియా టుడేతో మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రకారమే ఐపీఎల్ యథావిథిగా జరుగుతుందని మరోసారి స్పష్టం చేశారు. అలాగే మ్యాచ్లు జరిగే వేళ కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు.