కోల్కతా: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన కోల్కతాలోని అపోలా ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి అనారోగ్యానికి గురైన దాదా.. బుధవారం మధ్యాహ్నం మరోసారి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇటీవల గుండెపోటుకు గురై కోలుకున్న దాదా మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త క్రికెట్ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
సౌరవ్ గంగూలీ అపోలా ఆసుపత్రికి చేరకముందే వైద్య బృందం అతని కోసం సిద్ధంగా ఉందట. అయితే ఆసుపత్రి లోపలి వెళ్లేందుకు స్ట్రెచర్ లేదా వీల్ చైర్ సహాయం తీసుకోవడానికి దాదా నిరాకరించారని సమాచారం. దాదా ఆసుపత్రి లోపలికి నడుచుకుంటూ వెళ్లారని తెలుస్తోంది. గంగూలీ ఆరోగ్యం బాగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మరో రెండు స్టెంట్లు ఇప్పుడు వేసే అవకాశం ఉందని సమాచారం.
జనవరి 2న సౌరవ్ గంగూలీకి గుండెనొప్పి వచ్చింది. ఉదయం ట్రెడ్మిల్పై పరుగెత్తుండగా వాంతులు, తలనొప్పి, ఛాతినొప్పి వచ్చిందని ఉడ్ల్యాండ్ ఆస్పత్రిలో చేరారు. ఆయనను పరీక్షించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్టు గుర్తించారు. ప్రాథమిక యాంజియోప్లాస్టీ చేశారు. సమస్య తీవ్రంగా ఉన్నచోట స్టంట్ వేశారు. ఐదు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. మిగతా పూడికలను తొలగించేందుకు మరికొన్ని రోజుల తర్వాత యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ క్రమంలోనే బుధవారం దాదా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. చాతీలో నొప్పి వస్తుందనడంతో కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్తగా ఆసుపత్రికి తరలించారు. మరో రెండు స్టెంట్లు ఇప్పుడు వేసే అవకాశం ఉందని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.