
న్యూఢిల్లీ: టీమిండియా మహిళా క్రికెటర్ స్నేహ్ రాణా కోచ్ నరేంద్ర షా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒక అమ్మాయిని లైంగికంగా వేధించినందుకు అతనిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడంతో సూసైడ్ అటెంప్ట్ చేశాడు. స్నేహ్ రాణాను అంతర్జాతీయ క్రికెటర్గా తీర్చిదిద్దిన నరేంద్ర షా.. డెహ్రాడూన్లో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మోలి జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక చదువుకుంటూనే నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది.
అయితే గత కొంతకాలంగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న నరేంద్ర షా.. లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో పోలీసులు అతడిపై పోక్సో యాక్ట్ తో పాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదుచేశారు. ఆడియో లీక్ కావడంతో పరువు పోయిందని భావించిన నరేంద్ర షా.. రెండ్రోజుల క్రితం తన ఇంట్లో పాయిజన్ తాగి ఆత్మహత్యయత్నం చేశాడని నెహ్రూ కాలనీ పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం స్నేహ్ రానాకు కోచ్గా ఉన్న నరేంద్ర షా ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు. నరేంద్రపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుసుకున్న ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అతడిని పదవి నుంచి తొలగించింది. నరేంద్ర షా ప్రస్తుతం డెహ్రాడూన్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత పోలీసులు అతన్ని విచారించనున్నారు. నరేంద్ర షాపై వచ్చిన లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకుంది. అసొసియేషన్ కో కన్వీనర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
టీమిండియా మహిళా క్రికెట్లో ఆల్రౌండర్గా సేవలందిస్తున్న స్నేహ్ రాణా ఇటీవలే వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఆడింది. గుజరాత్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహించిన ఆమె రెగ్యులర్ కెప్టెన్ బెత్ మూనీ గాయంతో టోర్నీకి దూరమవడంతో జట్టును కూడా నడిపించింది. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన గుజరాత్ ప్లే ఆఫ్స్కు చేరలేదు. ఫైనల్లో ఢిల్లీని ఓడించిన ముంబై తొలి సీజన్ టైటిల్ను సొంతం చేసుకుంది.