మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీకి సన్నాహకంగా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో టీమిండియా ఎట్టకేలకు విజయం సాధించింది. తొలి మ్యాచ్ పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు.. బుధవారం జరిగిన రెండో వన్డేలో సమష్టిగా రాణించి 102 పరుగుల భారీ తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(91 బంతులాడి 14 ఫోర్లు, 4 సిక్స్లతో 117) విధ్వంసకర శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. మంధానకు తోడుగా దీప్తి శర్మ(40) ఒక్కతే రాణించగా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్(3/42) మూడు వికెట్లు తీయగా.. మేగన్ స్కట్, అన్నబెల్ సదర్లాండ్, తహిలా మెక్గ్రాత్ చెరో వికెట్ తీసారు.

అనంతరం ఆస్ట్రేలియా 190 పరుగులకే కుప్పుకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్(3/28) మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ(2/24) రెండు వికెట్లు పడగొట్టింది. రేణుకా సింగ్, స్నేహ్ రాణా, అరుందతి రెడ్డి, రాధా యాదవ్ తలో వికెట్ తీసారు. ఆసీస్ బ్యాటర్లలో ఎల్లిస్ పెర్రీ(44), సదర్లాండ్(45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. సిరీస్ డిసైడర్గా మారిన ఆఖరి వన్డే శనివారం జరగనుంది. 2007 తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియాపై టీమిండియా సాధించిన తొలి విజయం ఇదే కావడం గమనార్హం.