
ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదో మ్యాచ్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. తమ ఓటమికి పేలవ బ్యాటింగే కారణమని కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. తనతో పాటు టాపార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారని పేర్కొంది. 14 ఓవర్ల వరకు జిడ్డుగా బ్యాటింగ్ చేయడం ఓటమిని శాసించిందని చెప్పింది. ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ సూపర్ బ్యాటింగ్తో జట్టును ఆదుకొని పోరాడే లక్ష్యాన్ని అందించినా.. బౌలర్లు సత్తా చాటినా ఫలితం దక్కలేదని తెలిపింది. మరో 10-15 పరుగులు చేసుంటే ఫలితం మరోలా ఉండేదని చెప్పింది.
'బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. మ్యాచ్ను 20వ ఓవర్ వరకు తీసుకెళ్లారు. జట్టు పరంగా చాలా మెరుగయ్యాం. కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ఎల్లిస్ పెర్రీ, రిచా ఘోష్ సూపర్ పార్ట్నర్షిప్తో జట్టును ఆదుకున్నారు. వారి అనుభవంతో పోరాడే లక్ష్యాన్ని అందించారు. మ్యాచ్ గెలిచే మూమెంటమ్ను అందించారు. అయితే మాకు సరైన ఆరంభం దక్కలేదు. నేను కూడా దారుణంగా విఫలమయ్యాను. ముఖ్యంగా తొలి 14 ఓవర్లు మాకు తీరని నష్టం చేశాయి. 10-15 పరుగులు అదనంగా చేసుంటే విజయానికి అవకాశం ఉండేది. పిచ్ మారుతూ వచ్చింది. వేదికలపై మ్యాచ్ల సంఖ్య పెరుగుతున్నా కొద్దీ.. వికెట్లు మరింత నెమ్మదిగా తయారవనున్నాయి.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన(8) విఫలమైనా.. ఎల్లిస్ పెర్రీ(52 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 67 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించింది. రిచా ఘోష్(16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 37)తో కలిసి పెర్రీ నాలుగో వికెట్కు 74 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించింది. ఢిల్లీ బౌలర్లలో శిఖా పాండే మూడు వికెట్లు తీయగా.. తారా నోర్రీస్ ఓ వికెట్ పడగొట్టింది.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలుపొందింది. మరిజన్నే కేప్(32 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 32), జెస్స్ జొనాస్సెన్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 29) చివరి వరకు క్రీజులో నిలబడి విజయాన్నందించారు. అలిస్ కాప్సీ(38), జెమీమా రోడ్రిగ్స్(32) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో మేఘన్ స్కట్, ప్రీతీ బోస్ చెరొక వికెట్ తీయగా.. సోభన ఆశా రెండు వికెట్లు తీసింది.