మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీకి ముందు టీమిండియా కీలక సిరీస్ను కోల్పోయింది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-1తో భారత్ చేజార్చుకుంది. ఢిల్లీ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో గెలిచే మ్యాచ్లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ హైస్కోరింగ్ గేమ్లో విజయం కోసం టీమిండియా ఆఖరి వరకు పోరాడింది. కానీ వరుసగా వికెట్లు కోల్పోవడం టీమిండియా ఓటమిని శాసించింది. దాంతో స్మృతి మంధాన (63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్లతో 125) విధ్వంసకర శతకం వృధాగా మారింది.
కీలక సమయంలో దీప్తి శర్మ(58 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 72) ఔటవ్వడం ఈ మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా మారింది. నిలకడగా ఆడుతున్న దీప్తి శర్మను తహిలా మెక్గ్రాత్ పెవిలియన్ చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 412 పరుగుల భారీ స్కోర్కు ఆలౌటైంది. బెత్ మూనీ(75 బంతుల్లో 23 ఫోర్లు, సిక్స్తో 138) విధ్వంసకర శతకంతో రాణించగా.. జార్జియో వోల్(81), ఎల్లిస్ పెర్రీ(68) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారత బౌలర్లలో తెలుగు తేజం అరుంధతి రెడ్డి(3/8) మూడు వికెట్లు తీయగా.. రేణుకా సింగ్(2/79), దీప్తి శర్మ(2/75) రెండేసి వికెట్లు పడగొట్టారు. క్రాంతి గౌడ్, స్నేహ్ రానా చెరో వికెట్ తీసారు.

అనంతరం భారత మహిళల జట్టు 47 ఓవర్లలో 369 పరుగులకు ఆలౌటైంది. స్మృతి మంధాన విధ్వంసకర శతకానికి తోడుగా.. హర్మన్ప్రీత్ కౌర్(52), దీప్తి శర్మ(58 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 72) హాఫ్ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆసీస్ బౌలర్లలో కిమ్ గార్త్(3/69) మూడు వికెట్లు తీయగా.. మేగన్ స్కట్(2/53) రెండు వికెట్లు పడగొట్టింది. అశ్లే గార్డెనర్, తహిలా మెక్గ్రాత్, గ్రేస్ హ్యారీస్, జార్జియో వేర్హమ్ తలో వికెట్ తీసారు.
ఈ సిరీస్లో టీమిండియా ఓడినా మెరుగైన ప్రదర్శన చేసింది. కానీ మరోసారి ఒత్తిడికి చిత్తయ్యి గెలిచే మ్యాచ్ను చేజార్చుకుంది. సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.