
లండన్: వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ ప్రారంభిస్తామని ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సంకేతాలిచ్చింది. ఇదే విషయాన్ని టీమిండియా స్టార్ బ్యాటర్, క్రికెట్ బ్యూటీ స్మృతి మంధాన ముందు ప్రస్తావించగా.. 'ఆ స్టార్ట్ అయ్యాక చూద్దాంలే'అంటూ తలను గుండ్రంగా తిప్పుతూ తనదైన శైలిలో క్యూట్ రియాక్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. కుర్రాళ్ల మనసులను కొల్లగొడుతోంది.
అసలు విషయం ఏంటంటే.. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల ది హండ్రెడ్ లీగ్లో ఆడుతున్న స్మృతి మంధాన సౌతర్న్ బ్రేవ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. ఓవల్ ఇన్విజిబుల్స్ జట్టుతో మ్యాచ్ అనంతరం రిపోర్టర్లు ఆమెను ఐపీఎల్ గురించి అడిగారు. 'వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది. మీ నుంచి ఇదే ఉత్సాహం, ఆటను మేం అక్కడ కూడా ఆశించవచ్చా?'అనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్న వినగానే స్మృతి తలను దించుతూ అటు ఇటు ఊపింది.
అనంతరం మాట్లాడుతూ.. 'భారత్లో క్రికెట్ ను చాలా ఇష్టపడతారు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా మేం ఏ మ్యాచ్ ఆడినా మాకు మద్దతునిస్తారు. ఇండియాలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు మాలో తెలియని ఉత్సాహం ఉంటుంది. మహిళల ఐపీఎల్ ప్రారంభమవుతుండటం గొప్ప విషయం..' అని తెలిపింది. అయితే ఈ వీడియోను చూసిన అభిమానులు తమకు తోచిన కామెంట్స్ చేస్తున్నారు.
'ఆ.. అది ప్రారంభమైన తర్వాత చూద్దాంలే, మూడేళ్లుగా ఇదే వింటున్నాం, అది స్టార్ట్ అయ్యేవరకు చూద్దాం., ఇదే ప్రశ్న మూడేళ్లుగా అడుగుతున్నారు. మళ్లీ అదేనా?.'అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందని సెటైర్లు పేల్చుతున్నారు. పురుషుల ఐపీఎల్ ముందే మహిళల ఐపీఎల్ నిర్వహిస్తామని ఇటీవలే ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు. గతంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.