పిచ్ బౌలింగ్కు సహకరించడంతోనే నెమ్మదిగా ఆడామని టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఎట్టకేలకు బోణీ కొట్టింది. దాయాదీ పాకిస్థాన్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్.. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 105 పరుగులే చేసింది. నిదా దార్(34 బంతుల్లో ఫోర్తో 28) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో తెలుగు తేజం అరుందతి రెడ్డి(3/19) మూడు వికెట్లతో సత్తా చాటగా.. రేణుక సింగ్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు. శ్రేయాంక పాటిల్కు రెండు వికెట్లు దక్కాయి.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 108 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(7) విఫలమైనా.. షెఫాలీ వర్మ(35 బంతుల్లో 3 ఫోర్లతో 32), జెమీమా రోడ్రిగ్స్(28 బంతుల్లో 23), హర్మన్ప్రీత్ కౌర్(24 బంతుల్లో ఫోర్తో 29) ఆచితూచి ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
బ్యాటింగ్ సందర్భంగా హర్మన్ప్రీత్ గాయపడి రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్ చేరింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో బంతి ఆమె మెడకు బలంగా తాకింది. దాంతో పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్కు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన హాజరైంది. ప్రణాళికలకు తగ్గట్లు ఆడి విజయం సాధించామని తెలిపింది. హర్మన్ప్రీత్ కౌర్ గాయం గురించి ఎలాంటి సమాచారం లేదని, మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుందని, త్వరలోనే అప్డేట్ రానుందని తెలిపింది.
'ఈ మ్యాచ్లో మేం చాలా క్రమశిక్షణతో ఆడాం. మా వ్యూహాలను అమలు చేశాం. బౌలింగ్లో మెరుగైన ప్రదర్శన చేశాం. బ్యాటింగ్లో కూడా శుభారంభం అందిస్తే ఇంకా బాగుండేది. నెట్రన్రేట్ గురించి ఆలోచిస్తూనే బ్యాటింగ్ చేశాం. షెఫాలీ, నేను ధాటిగా ఆడలేకపోయాం. బంతి టైమ్ అవ్వలేదు. దాంతో ఎక్కువ వికెట్లు కోల్పోవద్దని భావించి నెమ్మదిగా ఆడాం. నెట్రన్ రేట్ను లెక్కల్లోకి తీసుకొనే బ్యాటింగ్ చేశాం. శ్రీలంక అద్భుతంగా ఆడుతోంది. ఈ మ్యాచ్ మాకు ఊపును ఇచ్చింది. అదే జోరులో శ్రీలంకపై గెలిచే ప్రయత్నం చేస్తాం.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.