నదినే డిక్లెర్క్ అసాధారణ ఆల్రౌండ్ ప్రదర్శనతోనే ఓడిపోయే మ్యాచ్లో విజయం సాధించామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. ఆర్సీబీ అంటేనే థ్రిల్లర్ మ్యాచ్లకు పెట్టింది పేరు అని చెప్పుకొచ్చింది.
డబ్ల్యూపీఎల్ 2026 సీజన్లో భాగంగా శుక్రవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ 3 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించింది. ఓటమి తప్పదనుకున్న ఈ మ్యాచ్లో నదినే డీక్లెర్క్(44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 63 నాటౌట్, 4/26)అసాధారణ ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆర్సీబీ విజయాన్ని కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్ అనంతరం ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన మంధాన.. డిక్లెర్క్పై ప్రశంసల జల్లు కురిపించింది. 'తొలి మ్యాచే అద్భుతమైన థ్రిల్లర్ను తలపించింది. ఆర్సీబీ అంటేనే థ్రిల్లర్లకు పెట్టింది పేరు. అసాధారణ ప్రదర్శనతో నదినే డిక్లెర్క్ మాకు ఈ విజయాన్ని అందించింది. పరిస్థితులు మాకు అనుకూలంగా లేనప్పుడు కూడా జట్టులోని ఆటగాళ్లంతా చాలా సానుకూలంగా ఉన్నారు. ఈ టోర్నీ కోసం మా సన్నద్దత బాగుంది. అందరూ మంచి ఫామ్లో కనిపిస్తున్నారు.

డిక్లెర్క్ బ్యాటింగ్, బౌలింగ్లో పూర్తి బాధ్యత తీసుకుంది. విశాఖపట్నంలో ఆమె మాకు ప్రత్యర్థిగా ఆడినప్పుడు కూడా ఇలాంటి ప్రదర్శనే చేసింది. తాజా మ్యాచ్ కూడా నాటి పరిస్థితులను తలపించింది. ఆ మ్యాచ్ను గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా డిక్లెర్క్ చెలరేగుతుందని మా కోచ్ రంగరాజన్తో చెబుతూనే ఉన్నారు. డిక్లెర్క్ క్యాచ్ డ్రాప్ అయినప్పుడు ముంబై ప్లేయర్ సజనలాగే ఆమె కూడా పరుగులు చేయాలని మేం కోరుకున్నాం.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. నికోలా కేరీ(29 బంతుల్లో 4 ఫోర్లతో 40), సజీవన్ సజన(25 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో నదినే డీ క్లెర్క్(4/26) నాలుగు వికెట్లు తీయగా.. లారెన్ బెల్, శ్రేయాంక పాటిలో చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులే చేసి గెలుపొందింది. నదినే డీ క్లెర్క్ అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. గ్రేస్ హ్యారీస్(12 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 25) దూకుడుగా ఆడింది. ముంబై బౌలర్లలో నికోలా కారీ(2/35), అమెలియా కేర్(2/13) రెండేసి వికెట్లు తీయగా.. నాట్ సీవర్ బ్రంట్, షబ్నిమ్ ఇస్మాయిల్, అమన్జోత్ కౌర్ తలో వికెట్ తీసారు.