గ్రేస్ హారిస్ తమ జట్టులో ఉండటంతో కెప్టెన్గా తనకు పెద్ద ప్రమాదం తప్పిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. ప్రత్యర్థిగా గ్రేస్ హారిస్ను ఆపడం చాలా కష్టమయ్యేదని అభిప్రాయపడింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2026 సీజన్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 9 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన స్మృతి మంధాన.. గ్రేస్ హారిస్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకున్నామని తెలిపింది. 'గ్రేస్ హారిస్ విధ్వంసకర బ్యాటింగ్ను చూడటానికి మైదానంలో అత్యుత్తమ స్థానమైన నాన్-స్ట్రైకర్ ఎండ్లో నేను ఉన్నాను. మా బౌలర్లందరూ బౌలింగ్ చేసిన తీరు, వారి ప్రణాళికలను అమలు చేసిన విధానం అద్భుతం. లారెన్ బెల్ డాట్ బాల్స్తో ప్రత్యర్థిని కట్టడి చేస్తోంది. ఆమె డాట్ బాల్స్ వేయడం చూసి.. సీజన్ ముగిసేవరకు ఎన్ని మొక్కలు పట్టుకెళ్లుతావని ఆట పట్టిస్తున్నాను. ఆరంభ ఓవర్లలో అయితే బ్యాటర్లను బంతిని టచ్ కూడా చేయనివ్వడం లేదు.

తొలి మ్యాచ్లో మా ఫీల్డ్ సెటప్ విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని గుర్తించాం. ఈరోజు ఆ లోపాలను సరిచేసుకున్నాం. సరైన ఫీల్డ్ సెటప్ పెట్టాం. ఈ విజయంతో జట్టు మొత్తం గర్వపడవచ్చు. కానీ ఇది కేవలం ఆరంభం మాత్రమే. హారిస్ ఓపెనింగ్ పార్ట్నర్గా నేను సింగిల్ తీయడమే నా పని. ఆమె ఆట అద్భుతం. ఒకరితో ఒకరిని పోల్చి ర్యాంకులు ఇవ్వడం సరికాదు. షెఫాలీ వర్మ అయినా.. గ్రేస్ అయినా.. వారు ఆడుతుంటే కేవలం సింగిల్ తీసి ఇస్తే సరిపోతుంది.
గ్రేస్ హారిస్ మా జట్టులో ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎందుకంటే నేను ప్రత్యర్థి జట్టు కెప్టెన్గా ఉండి ఉంటే.. ఆమెను ఆపడం చాలా కష్టమయ్యేది. ఆమె మిడిలార్డర్లో కూడా ఆడగలదు. కానీ టాప్ ఆర్డర్లో ఆమె ఎంత ప్రమాదకరంగా ఆడుతుందో.. ప్రత్యర్థి నుంచి మ్యాచ్ను ఎలా లాగేసుకోగలదో మాకు తెలుసు. ఆర్సీబీలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే.. ముందే ఎక్కువ ఊహించి మాట్లాడకూడదు. గత 3-4 ఏళ్లలో మాకు దొరికిన అత్యంత కష్టపడే తద్వం ఉన్న జట్టు ఇది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం.'అని స్మృతి మంధాన చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసింది. దీప్తి శర్మ(35 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 45 నాటౌట్), డియా డాటిన్(37 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 40) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయాంక పాటిల్(2/50), నదైన్ డి క్లెర్క్(2/28) రెండేసి వికెట్లు తీయగా.. లారెన్ బెల్ ఒక వికెట్ పడగొట్టింది.
అనంతరం ఆర్సీబీ 12.1 ఓవర్లలో 145 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్లు గ్రేస్ హ్యారీస్(40 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 85), స్మృతి మంధాన(32 బంతుల్లో 9 ఫోర్లతో 47 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. యూపీ వారియర్స్ బౌలర్లలో శిఖా పాండే ఒక్కతే వికెట్ తీసింది.