టీమిండియా వైస్ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) సారథి స్మృతి మంధాన ఆటలోనే కాదు ఆదాయంలోనూ రారాణిగా నిలిచింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2026 సీజన్లో ఆర్సీబీని స్మృతి మంధాన విజేతగా నిలబెట్టింది. నాలుగేళ్ల వ్యవధిలోనే ఆర్సీబీకి రెండు టైటిళ్లు అందించింది. కెప్టెన్గా ముందుండి నడిపించిన మంధాన అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా ఆరెంజ్ క్యాప్ అందుకుంది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సాధించిన కొన్ని రోజులకే డబ్ల్యూపీఎల్ టైటిల్ కూడా దక్కడంతో స్మృతి మంధాన ఆదాయం అమాంతం పెరిగింది. బిజినెస్ వర్గాల అంచనా ప్రకారం స్మృతి మంధాన నికర ఆస్తి విలువ 2026 నాటికి సుమారు రూ. 34 కోట్ల నుంచి రూ. 40 కోట్ల మధ్య ఉంటుంది. భారత మహిళా క్రికెటర్లలో మరే ప్లేయర్కు ఇంత ఆస్థి లేదు.

Smriti Mandhana Net Worth: స్మృతి మంధాన ప్రధాన ఆదాయం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, మ్యాచ్ ఫీజుల ద్వారా లభించనుంది. బీసీసీఐ సోమవారం ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల్లో గ్రేడ్-ఏ కాంట్రాక్ట్ దక్కింది. గ్రేడ్-ఏ మహిళా క్రికెటర్లకు ఏడాదికి రూ. 50 లక్షల వేతనం అందనుంది. మ్యాచ్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ వేతనం లభిస్తోంది. మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు కింద ఒక్కో టెస్ట్కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలను బీసీసీఐ ఇస్తున్న సంగతి తెలిసిందే.
డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ప్లేయర్లలో స్మృతి మంధాన ఒకరు. ఆర్సీబీ నుంచి రూ.3.5 కోట్ల వేతనాన్ని అందుకుంటుంది. మంధాన సారథ్యంలోనే ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ 2024తో పాటు డబ్ల్యూపీఎల్ 2026 టైటిళ్లను గెలిచింది. ఈ విజయాలతో ఆమె బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది.
స్మృతి మంధాన ప్రస్తుతం అనేక అంతర్జాతీయ, స్వదేశీ బ్రాండ్లకు ప్రచరాకర్తగా వ్యవహరిస్తోంది. ఒక్కో ఎండార్స్మెంట్ కోసం ఆమె సుమారు రూ. 50 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూపీఎల్ విజయం తర్వాత ఈ ధరను పెంచే అవకాశాలు ఉన్నట్లు బిజినెస్ వర్గాలు పేర్కొన్నాయి. హర్మన్ ప్రీత్ కౌర్ అనంతరం టీమిండియా సారథ్య బాధ్యతలను స్మృతి మంధాన కూడా చేపట్టే అవకాశం ఉంది.
ఆటకు ఆట.. అందానికి అందం ఉండటంతో స్మృతి మంధానకు దేశంలో ప్రత్యేక క్రేజ్ ఉంది. దాంతోనే ఆమె కోసం అనేక సంస్థలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఆమె Nike, Hyundai, Red Bull, Hero MotoCorp, Gulf Oil, Herbalife, Garnier, Mastercard, SBI Bank వంటి ప్రముఖ సంస్థలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మహారాష్ట్రలోని సాంగ్లీ లో విలాసవంతమైన సొంత ఇల్లు స్మృతి మంధానకు ఉంది. అలాగే ముంబై, ఢిల్లీలలో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె వద్ద సుమారు రూ. 70 లక్షల విలువైన రేంజ్ రోవర్ Evoque కారుతో పాటు, హ్యుండయ్ క్రెటా,మారుతి సుజుకి స్విఫ్ట్ వంటి కార్లు ఉన్నాయి. ఈ కలెక్షన్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.