టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే ఆస్ట్రేలియాపై అత్యంత వేగంగా శతకం బాదిన తొలి బ్యాటర్గా నిలిచింది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం జరిగిన రెండో వన్డేలో స్మృతి మంధాన ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్లో మంధాన 77 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. పురుషుల క్రికెట్లో ఈ రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. అతను ఆస్ట్రేలియాపై వన్డేల్లో 52 బంతుల్లోనే శతకం సాధించాడు.
ఈ మ్యాచ్లో మంధాన 91 బంతులాడి 14 ఫోర్లు, 4 సిక్స్లతో 117 పరుగులు చేసి వెనుదిరిగింది. తద్వారా పలు రికార్డ్లను తన పేరిట లిఖించుకుంది. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన రెండో బ్యాటర్గా నిలిచింది. ఐర్లాండ్పై స్మృతి మంధాననే 70 బంతుల్లో సెంచరీ బాదింది. ఇది మంధానకు 12వ శతకం కాగా.. ఓపెనర్గానే ఈ సెంచరీలు నమోదు చేసింది. తద్వారా అరుదైన జాబితాలో మంధాన చోటు దక్కించుకుంది.

మహిళల వన్డే క్రికెట్లో ఓపెనర్గా అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్ల జాబితాలో సుజీ బేట్స్, స్మృతి మంధాన, టమ్మీ బౌమోంట్ 12 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా..చార్లోట్ ఎడ్వర్డ్స్, హీలీ మాథ్యూస్ 9 శతకాలు నమోదు చేశారు. ఈ ఏడాది మంధానకు మూడో శతకం. వన్డేల్లో వేర్వేరు క్యాలెండర్ ఇయర్లో మూడు, అంత కంటే ఎక్కువ శతకాలు నమోదు చేసిన తొలి మహిళా బ్యాటర్గా కూడా మంధాన చరిత్రకెక్కింది. గతేడాది మంధాన వన్డేల్లో 4 శతకాలు నమోదు చేసింది.
మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన మెగ్ లాన్నింగ్కు మంధాన చేరువవుతోంది. మెగ్ లాన్నింగ్ 15 శతకాలు బాదగా, సుజీ బేట్స్ 13 శతకాలతో మంధాన కంటే ముందుంది. 12 వన్డే శతకాలతో పాటు రెండు టెస్ట్ సెంచరీలు, ఓ టీ20 సెంచరీ కూడా మంధాన పేరిట ఉన్నాయి. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన రెండో బ్యాటర్గా మంధాన నిలిచింది. ఈ జాబితాలో మెగ్ లాన్నింగ్ 17 శతకాలతో టాప్లో ఉండగా.. స్మృతి మంధాన 15 సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. సుజీ బేట్స్(14), టమ్మీ బూమోంట్(14), చార్లోట్ ఎడ్వర్డ్స్(13) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఈ మ్యాచ్లో టీమిండియా 102 పరుగుల భారీ తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ మంధాన శతకంతో 292 పరుగుల భారీ స్కోర్ చేసింది. మంధానకు తోడుగా దీప్తి శర్మ(40) ఒక్కతే రాణించింది. ఆసీస్ బౌలర్లలో డార్సీ బ్రౌన్(3/42) మూడు వికెట్లు తీయగా.. మేగన్ స్కట్, అన్నబెల్ సదర్లాండ్, తహిలా మెక్గ్రాత్ చెరో వికెట్ తీసారు.
అనంతరం ఆస్ట్రేలియా 190 పరుగులకే కుప్పుకూలింది. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్(3/28) మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ(2/24) రెండు వికెట్లు పడగొట్టింది. రేణుకా సింగ్, స్నేహ్ రాణా, అరుందతి రెడ్డి, రాధా యాదవ్ తలో వికెట్ తీసారు. ఆసీస్ బ్యాటర్లలో ఎల్లిస్ పెర్రీ(44), సదర్లాండ్(45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఆఖరి మ్యాచ్ శనివారం జరగనుంది.