టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(109 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్తో 105) చరిత్ర సృష్టించింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేయడం ద్వారా స్మృతి మంధాన అరుదైన ఘనతను అందుకుంది. ఒకే క్యాలెండర్ ఇయర్లో నాలుగు వన్డే సెంచరీలు చేసిన తొలి మహిళా బ్యాటర్గా చరిత్రకెక్కింది.
బెలిండా క్లార్క్(1997), మెగ్ లానింగ్(2016), అమీ సాటర్త్ వైట్(2016), సోఫీ డివైన్(2018), సిద్రా అమిన్(2012), నాట్ సివర్(2023), లారా వోల్వార్ట్(2024) ఒకే క్యాలెండర్ ఇయర్లో మూడేసి సెంచరీలు బాదారు. ఈ ఏడాది నాలుగు శతకాలు నమోదు చేసిన స్మృతి మంధాన ఈ ఘనతను అందుకున్న తొలి బ్యాటర్గా చరిత్రకెక్కింది.

ఇక స్మృతి మంధానకు ఇది 9వ వన్డే శతకం. ఈ క్రమంలోనే అత్యధిక సెంచరీలు నమోదు చేసిన తొలి ఆసియా బ్యాటర్గా శ్రీలంక ప్లేయర్ చమరి ఆటపట్టు రికార్డ్ను సమం చేసింది.
ఈ మ్యాచ్లో మంధాన సెంచరీతో మెరిసినా భారత్కు విజయం దక్కలేదు. దాంతో ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళల జట్టు ఘోర పరాజయంతో ముగించింది. మూడు వన్డేల సిరీస్ కోసం ఆసీస్ పర్యటనకు వచ్చిన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు 0-3తో క్లీన్ స్వీప్కు గురైంది. బుధవారం ముగిసిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 83 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 298 పరుగులు చేసింది. అన్నాబెల్ సదర్లాండ్(95 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 110) శతకంతో సత్తా చాటగా.. ఆష్లీ గార్డ్నర్(64 బంతుల్లో 5 ఫోర్లతో 50), తహిలా మెక్గ్రాత్(50 బంతుల్లో 5 ఫోర్లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.
భారత బౌలర్లలో తెలుగు తేజం అరుందతి రెడ్డి(4/26) నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ ఓ వికెట్ తీసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత మహిళల జట్టు 45.1 ఓవర్లలో 215 పరుగులకు కుప్పకూలింది. స్మృతి మంధాన మినహా మరే బ్యాటర్ రాణించలేదు. హర్లీన్ డియోల్(64 బంతుల్లో 4 ఫోర్లతో 39) కాస్త పర్వలేదనిపించింది.
ఆస్ట్రేలియా బౌలర్లలో ఆష్లే గార్డ్నర్(5/30) ఐదు వికెట్లు తీయగా.. మేఘన్ స్కట్, అలనా కింగ్ తలో రెండు వికెట్లు తీసారు. అన్నబెల్ సదర్లాండ్కు ఓ వికెట్ దక్కింది.