భారత మహిళ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 4 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత ప్లేయర్గా చరిత్రకెక్కింది. సొంతగడ్డపై ఐర్లాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో స్మృతి మంధాన ఈ ఫీట్ సాధించింది.
ఈ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఐర్లాండ్ను ఓడించింది. ఈ గెలపుతో మూడు వన్డేల సిరీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు విశ్రాంతి ఇవ్వడంతో స్మృతి మంధాన తాత్కలిక సారథిగా వ్యవహరిస్తోంది.

ప్రతీకా విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. ఆ జట్టు కెప్టెన్ గబీ లూయిస్(129 బంతుల్లో 15 ఫోర్లతో 92) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. లీహ్ పాల్(73 బంతుల్లో 7 ఫోర్లతో 59) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా(2/56) రెండు వికెట్లు తీయగా.. టిటస్ సధు, సయలి, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత మహిళల జట్టు 34.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 241 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ ప్రతీకా రావల్(96 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 83), తేజల్ హసబ్నిస్(46 బంతుల్లో 9 ఫోర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.
కెప్టెన్ స్మృతి మంధాన(29 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 41) శుభారంభం అందించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లెనే కెల్లీ ఓ వికెట్ తీయగా.. మాగ్యూరీ మూడు వికెట్లు పడగొట్టింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది.
మిథాలీ రాజ్ తర్వాత..
ఈ మ్యాచ్లో దూకుడుగా ఆడిన స్మృతి మంధాన తొలి వికెట్కు 70 పరుగులు జోడించింది. ఈ క్రమంలోనే వన్డే క్రికెట్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో ఈ ఫీట్ సాధించిన 15వ ప్లేయర్గా, రెండో భారత క్రీడాకారిణిగా మంధాన నిలిచింది. స్మృతి మంధాన కంటే ముందు భారత్ తరఫున మిథాలీ రాజ్ ఈ ఫీట్ సాధించింది. 95 ఇన్నింగ్స్ల్లోనే మంధాన ఈ ఫీట్ సాధించడం విశేషం. ఓవరాల్గా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్గా.. తొలి భారత బ్యాటర్గా చరిత్రకెక్కింది.
మహిళల అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా ప్లేయర్ బెలిండా క్లార్క్ 86 ఇన్నింగ్స్ల్లోనే 4 వేల పరుగులు అందుకొని ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆమె తర్వాత మెగ్ లాన్నింగ్(87 ఇన్నింగ్స్లు), స్మృతి మంధాన(95), లారా వోల్వార్డ్(96), కరేన్ రోల్టన్(103), సుజీ బీట్స్(105), స్టేఫనీ టేలర్(107), తమ్సిన్ బ్యూమౌంట్(110), మిథాలీ రాజ్(112), డెబ్బీ హక్లీ(112) కొనసాగుతున్నారు.