తన పెళ్లి వాయిదాపై వస్తున్న వార్తలకు టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన చెక్ పెట్టింది. తన ప్రియుడు, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్తో వివాహాన్ని పూర్తిగా రద్దు చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. స్మృతి, పలాశ్ ముచ్చల్ తమ ఇన్స్టాగ్రామ్ బయోలో దిష్టి రక్ష ఎమోజీలను చేర్చారు. తద్వారా తమకు ఎలాంటి సమస్యలు లేవనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
నవంబర్ 23 జరగాల్సిన స్మృతి-పలాష్ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. స్మృతి మంధాన తండ్రి గుండెపోటు లక్షణాలతో బాధపడటంతో పెళ్లిని వాయిదా వేసారు. ఆ తర్వాత ఈ పెళ్లికి సంబంధించిన పోస్ట్లు స్మృతి మందాన సోషల్ మీడియా ఖాతాల్లో మాయమయ్యాయి. ముఖ్యంగా పలాష్తో ఎంగేజ్మెంట్ ధ్రువీకరిస్తూ.. నిశ్చితార్థ రింగ్ను చూపిస్తూ స్మృతి పోస్ట్ చేసిన వీడియో కనిపించలేదు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికల్లో పంచుకున్న స్మృతి సహచరులు జెమీమా, శ్రేయాంక్ పాటిల్లు కూడా తొలగించడంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి.

స్మృతి, పలాష్ ముచ్చల్ మధ్య మనస్థర్థలు వచ్చాయని ప్రచారం జరిగింది. అదే సమయంలో మరో మహిళతో పలాష్ ముచ్చల్ జరిపిన సీక్రెట్ చాట్స్ నెట్టింట వైరల్గా మారాయి. ఇందులో స్మృతిని అవమానించేలా పలాష్ ముచ్చల్ మాట్లాడినట్లు ఉంది. అంతేకాకుండా సంగీత్కు వచ్చిన ఓ కొరియోగ్రాఫర్తో పలాష్ ముచ్చల్ సన్నిహితంగా ఉండటాన్ని స్మృతి ఫ్యామిలీ చూసిందని, దాంతోనే వివాహాన్ని ఆపేసిందని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలకు స్మృతి దిష్టి రక్ష ఎమోజీతో చెక్ పెట్టింది.
మరోవైపు పలాష్ తల్లి అమిత.. త్వరలోనే స్మృతితో తన కొడుకు వివాహం జరుగుతుందని చెప్పింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపింది. పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటున్నాయని, అతి త్వరలోనే వివాహం జరుగుతుందని చెప్పింది.
