కొలంబో: శ్రీలంకతో రెండో టెస్ట్ల సిరీస్ను పాకిస్థాన్ క్లీన్ స్వీప్ చేసింది. గురువారం ముగిసిన రెండో టెస్ట్లో పాకిస్థాన్ ఇన్నింగ్స్ 222 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 411 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన శ్రీలంక 188 పరుగులకు కుప్పకూలింది.
పాకిస్థాన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ నోమన్ అలీ(7/70) ఏడు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించగా.. నసీమ్ షా(3/44) తీన్మార్ బౌలింగ్తో నిప్పులు చెరిగాడు. లంక బ్యాటర్లలో ఏంజేలో మాథ్యూస్(127 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 63 నాటౌట్) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే శ్రీలంకకు ఇది అత్యంత ఘోర పరాజయం కావడం గమనార్హం. ఇక శ్రీలంక గడ్డపై పాకిస్థాన్కు ఇది ఐదో టెస్ట్ సిరీస్ విజయం. క్రికెట్ చరిత్రలోనే శ్రీలంక గడ్డపై ఐదు టెస్ట్ సిరీస్లు గెలిచిన తొలి జట్టుగా పాక్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
కెప్టెన్ దిముత్ కరుణరత్నే(61 బంతుల్లో 6 ఫోర్లతో 41) కాస్త పర్వాలేదనిపించాడు. ఈ విజయంతో రెండు టెస్ట్ల సిరీస్ను పాకిస్థాన్ 2-0తో క్లీన్ స్వీప్ చేసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఎడిషన్ను ఘనంగా ప్రారంభించింది. ఈ క్లీన్ స్వీప్ విజయంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది.
తొలి టెస్ట్లో గట్టి పోటీనిచ్చిన శ్రీలంక రెండో టెస్ట్లో మాత్రం తేలిపోయింది. పేలవ బ్యాటింగ్తో పాటు పసలేని బౌలింగ్తో మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 48.4 ఓవర్లలో 166 పరుగులకు కుప్పకూలింది.
యువ పేసర్ నసీమ్ షా(3/41) నిప్పులు చెరగగా.. స్పిన్నర్ అబ్రర్ అహ్మద్(4/69) బంతితో శ్రీలంక బ్యాటర్లను చెడుగుడు ఆడాడు. శ్రీలంక బ్యాటర్లలో ధనంజయ డి సిల్వా(68 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 57), దినేశ్ చండిమల్(60 బంతుల్లో 4 ఫోర్లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ను 576/5 స్కోర్కు డిక్లేర్ చేసింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(326 బంతుల్లో 19 ఫోర్లు, 4 సిక్స్లతో 201) డబుల్ సెంచరీతో చెలరేగగా.. అఘా సల్మాన్(154 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్తో 132 నాటౌట్) అజేయ సెంచరీతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో అసితా ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా.. ప్రభాత్ జయసూర్య రెండు వికెట్లు తీసాడు.