
గాలే: పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్ట్లో శ్రీలంక భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 96 ఓవర్లలో 9 వికెట్లకు 329 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక ఆధిక్యం 333 పరుగులకు చేరగా.. క్రీజులో దినేశ్ చండీమల్(121 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 86 బ్యాటింగ్), ప్రభాత్ జయసూర్య(4 బ్యాటింగ్) ఉన్నారు. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ నవాజ్(5/88) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. యాసిర్ షా(3/122) మూడు వికెట్లు తీసాడు. హసన్ అలీకి ఓ వికెట్ దక్కింది.
అంతకుముందు 36/1 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓవర్ నైట్ బ్యాటర్ కాసున రజిత నాలుగు పరుగులు మాత్రమే చేసి ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్(76)తో ఓషాడా ఫెర్నాండో జట్టును ఆదుకున్నాడు. మూడో వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఆ తర్వాత వచ్చిన ఏంజేలో మాథ్యూస్ విఫలమైనా.. చండీమల్ ఫస్ట్ ఇన్నింగ్స్ జోరును కొనసాగిస్తూ వన్డే తరహా బ్యాటింగ్తో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. మరో ఎండ్లో ధనంజయ డిసిల్వా(20), నిరోషన్ డిక్ వెల్లా(12), రమేశ్ మెండీస్(22), మహీశ్ తీక్షణ(11) ఔటైనా.. చండీమల్ తనదైన శైలిలో చెలరేగాడు. టెయిలండర్ల సాయంతోనే విలువైన పరుగులు చేశాడు.
ఇక ఈ మ్యాచ్లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 222 పరుగులకు ఆలౌటైంది. ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ చండీమలే(76) జట్టును ఆదుకున్నాడు. అనంతరం పాకిస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(244 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 119) సెంచరీ చేయగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దాంతో లంకకు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
సంక్షిప్త స్కోర్లు:
శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 222 ఆలౌట్( చండీమాల్ 76, షాహిన్ అఫ్రిది 4/58)
పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 218 ఆలౌట్( బాబర్ ఆజామ్ 119, జయసూరియా 5/82)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 96 ఓవర్లలో 329/9 (చండీమల్ 86 బ్యాటింగ్, మహమ్మద్ నవాజ్ 5/88)