ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు వన్డే ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని పరాజయం ఎదురైంది. శ్రీలంక పర్యటనలో రెండు వన్డేల సిరీస్లో ఆసీస్ 0-2తో క్లీన్ స్వీప్ అయ్యింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 174 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఈ గెలుపుతో రెండు వన్డేల సిరీస్ను శ్రీలంక కైవసం చేసుకుంది.
కుశాల్ మెండీస్ సెంచరీ
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 281 పరుగులు చేసింది. కుశాల్ మెండీస్(115 బంతుల్లో 11 ఫోర్లతో 101) సెంచరీతో చెలరేగగా.. చరిత్ అసలంక(66 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 78 నాటౌట్), నిషాన్ మధుషంక(70 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.

రఫ్ఫాడించిన శ్రీలంక..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 24.2 ఓవర్లలో 107 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(34 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 29), జోష్ ఇంగ్లీస్(27 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ట్రావిస్ హెడ్(18), గ్లేన్ మ్యాక్స్వెల్(1) తీవ్రంగా నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలగే(4/35) నాలుగు వికెట్లు తీయగా.. వానిందు హసరంగా, అసితా ఫెర్నాండో మూడేసి వికెట్లు పడగొట్టారు.
బలహీనంగా ఆసీస్
మరో ఐదు రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి తెరలేవనుండగా.. ఈ పరాజయం ఆసీస్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయనుంది. ఇప్పటికే కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినీస్, జోష్ హజెల్ వుడ్ ఈ టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. అనుభవం కలిగిన ఆటగాళ్లు లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతున్న ఆసీస్.. తాజాగా పసికూన శ్రీలంక చేతిలో ఓడటం చర్చనీయాంశమైంది.
జయసూర్య మార్క్ విజయం..
దిగ్గజ ప్లేయర్ సనత్ జయసూర్య శ్రీలంక హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు సంచలన ప్రదర్శన చేస్తోంది. ఆయన పర్యవేక్షణలో భారత్పై వన్డే సిరీస్ గెలిచిన శ్రీలంక, ఇంగ్లండ్, న్యూజిలాండ్లపై టెస్ట్ సిరీస్లు సొంతం చేసుకుంది. వెస్టిండీస్పై టీ20, వన్డే సిరీస్తో పాటు న్యూజిలాండ్పై వన్డే సిరీస్ గెలిచింది. ఆ జట్టుతో టీ20 సిరీస్ సమం చేసుకున్న శ్రీలంక.. తాజాగా ఆసీస్ను చిత్తు చేసి తమను ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దని ప్రత్యర్థులను హెచ్చరించింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో శ్రీలంక పాల్గొనడం లేదు. టాప్-8 టీమ్స్లో ఆ జట్టు లేకపోవడంతో ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది.