ఐపీఎల్ 2025 సీజన్లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)పై అదానీ గ్రూప్ కన్నేసినట్లు తెలుస్తోంది. చాలా ఏళ్లుగా ఐపీఎల్ ప్రాంచైజీ కోసం అదానీ గ్రూప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు లీగ్లో కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇవ్వగా.. గుజరాత్ బేస్ ఫ్రాంచైజీ కోసం అదానీ గ్రూప్ తీవ్రంగా ప్రయత్నించింది. కానీ తృటిలో జట్టు చేజార్చుకుంది. అయితే ఆర్సీబీ అమ్మెందుకు ఆ జట్టు యాజమాన్యం డయాజియో కంపెనీ సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్సీబీని దక్కించుకునేందుకు ఆదానీ గ్రూప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
18 ఏళ్ల తర్వాత టైటిల్ గెలవడంతో ఆర్సీబీ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ రెట్టింపు అయ్యింది. ఈ సమయంలో ఫ్రాంచైజీని విక్రయించడం ద్వారా డయాజియో గరిష్ట లాభాలను పొందాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. డయాజియో కంపెనీ ప్రధాన వ్యాపారం మద్యం. డయాజియోకు అమెరికా అతిపెద్ద మార్కెట్. అయితే అక్కడ సుంకాలు పెరగడం, వినియోగదారుల తగ్గడంతో ప్రీమియం మద్యం అమ్మకాలపై ప్రభావం పడింది. దాంతో ఆ సంస్థ..ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మడం ద్వారా వచ్చే డబ్బులను ప్రధాన వ్యాపారంపై పెట్టాలనే యోచనలో డయాజియో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్తో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్గా ఉన్న జేఎస్డబ్ల్యూ-పార్ట్ జిందాల్, అథర్ పూనవల్లా, మరో రెండు అమెరికన్ కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ పేర్కొంది. జేఎస్ డబ్ల్యూ గ్రూప్-పార్థి జిందాల్ కంపెనీకి ఢిల్లీ క్యాపిటల్స్లో 50 శాతం వాటా ఉంది. అతను ఆర్సీబీని కొనుగోలు చేస్తే లీగ్ రూల్స్ ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ వాటాలను విక్రయించాల్సి ఉంటుంది.
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అయిన అథర్ పూనవల్లా కూడా ఆర్సీబీని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 'ధర సరిగ్గా ఉంటే ఆర్సీబీ గొప్ప జట్టు'అని ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. అమెరికాకు చెందిన రెండు ఈక్విటీ సంస్థలు కూడా ఆర్సీబీని కొనుగోలు చేయాలనుకుంటున్నాయట.
ఆర్సీబీ జట్టు ధరను 2 బిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.16,834 కోట్లు)గా డియాజియో కంపెనీ పేర్కొటున్నట్లు సమాచారం. ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఫ్రాంచైజీకి చెల్లించే అత్యధిక ధరగా ఇది రికార్డుకెక్కనుంది. డయాజియో ఇండియా శాఖ మాత్రం ఈ అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్సీబీ అమ్మకం గురించి డయాజియో కంపెనీ ఇప్పటి వరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు.