చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) తరఫున 60 ఏళ్ల వరకు ఆడాలని తమిళ హీరో శివకార్తికేయన్ మహేంద్ర సింగ్ ధోనీని కోరాడు. రిటైర్మెంట్ అవుతున్నారా? అంటే కాదు అని చెప్పే సమాధానం ప్రతీ సీజన్లో కోనసాగించాలని విజ్ఞప్తి చేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా సీఎస్కే రోర్స్ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో తమ పాత ఆటగాళ్లతో ప్రస్తుత టీమ్ సరదాగా మ్యాచ్ ఆడింది.
ఈ ఈవెంట్కు అభిమానులను అనుమతించగా.. స్టేడియం మొత్తం పసుపుమయమైంది. హీరో శివకార్తీకేయ ముఖ్య అతిథిగా హాజరై.. ధోనీతో మాట్లాడాడు. 'ధోనీ లాంటి దిగ్గజం ముందు నిలబడటం నాకు కొంచెం కంగారుగా ఉంది. నేను మీలాగా కూల్ పర్సన్ కాదు. అందుకే కొంచెం భయంగా ఉంది. నేను మిమ్మల్ని టీవీలో చూశాను. మైదానంలో చూశాను. కానీ ఇంత దగ్గరగా చూడటం ఇదే తొలిసారి. నేను మీకు పెద్ద అభిమానిని. మీ క్రికెట్ కంటే మీ నాయకత్వమే మాకు ఎక్కువ ఇష్టం. మా లాంటి వాళ్లకు మీరు ఒక స్ఫూర్తి.

నేను ఈ చేపాక్ స్టేడియానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ECRలో ఉంటాను. కానీ మీరు చెపాక్ స్టేడియంకు వచ్చిన ప్రతీసారి.. ECRలో అభిమానుల సందడి ఒక రేంజ్లో ఉంటుంది. కొన్నేళ్ల క్రితం ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని అడిగినప్పుడు కచ్చితంగా కాదు అని బదులిచ్చారు. ప్రతీ ఐపీఎల్ సీజన్ ముగింపులో మీ నుంచి మేం ఆ సమాధానం వినాలని ఆశిస్తున్నాం.'అని శివ కార్తికేయన్ అన్నాడు.

వెంటనే ధోనీ మైక్ అందుకొని.. అది చాలా కష్టమని పేర్కొన్నాడు. ఆ వెంటనే శివకార్తికేయన్.. 'మీరు ఎన్ని సంవత్సరాలు ఆడిన.. 60 ఏళ్ల వయసు వరకు ఆడినా మేం చూస్తాం.'అని అన్నాడు. దీనికి ధోనీ తాను ప్రయత్నిస్తానని, కానీ ఆటలో హెచ్చుతగ్గులు ఉంటాయని తెలిపాడు.
ఈ ప్రోత్సాహపు మాటలు తమకు చాలని, మీరు ఎలా ఆడినా స్వీకరిస్తామని శివ కార్తికేయన్ తెలిపాడు. సంజూ శాంసన్పై కూడా శివ కార్తికేయన్ ప్రశంసల జల్లు కురిపించాడు. తమిళనాడు, కేరళ మధ్య మంచి అనుబంధం ఉందని, ఆ విషయం సంజూకు బాగా తెలుసున్నాడు. కేరళకు చెందిన మలయాళ చిత్రాలు ఇక్కడ సూపర్ హిట్ అవుతాయని తెలిపాడు. కేరళ నటులను తమిళనాడు ప్రోత్సహించందన్నాడు. కేరళ నుంచి చెన్నై జట్టులోకి వచ్చిన తొలి ఆటగాడు సంజూశాంసన్ అని, అతను కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. సంజూ రాకతో సీఎస్ జట్టు బలం రెట్టింపు అయ్యిందని కొనియాడాడు.
'కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు నా అభినందనలు. రుతురాజ్.. నీకు ఇద్దరు గొప్ప మద్దతుదారులు ఉన్నారు. వారిలో ఒకరు మైదానంలో మీతో ఉండే ధోనీ. ధోనీ ఒక ముఫాసా అయితే.. మీరు ఒక సింబా. అదే విధంగా ప్రేక్షకులమైన మేం కూడా మీ వెనుక నిలబడి ఉన్నాం. సీఎస్కే ఒక కుటుంబం, అభిమానులకు అతీతంగా మేమంతా ఒక కుటుంబం. ఓటమిలో కూడా మేం మీతో నిలబడుతాం. నేను అభిమానుల తరఫున ఇక్కడికి వచ్చాను.'అని శివకార్తీకేయన్ తన సినిమాలోని డైలాగ్తో తన ప్రసంగాన్ని ముగించాడు.
