న్యూజిలాండ్తో తొలి వన్డేలో గాయపడిన టీమిండియా స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో సెలెక్టర్లు ఆయుష్ బదోనిని ఎంపిక చేశారు. అయితే ఈ ఎంపికపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఏ రకంగా సుందర్ స్థానంలో బదోనిని ఎంపిక చేశారని నెటిజన్లు ప్రశ్నించారు. స్పిన్ ఆల్రౌండర్ స్థానంలో పార్ట్టైమ్ బౌలర్ను ఎలా తీసుకుంటారని నిలదీసారు. గంభీర్కు ఫేవరేట్ ప్లేయర్ కావడంతోనే బదోనికి అవకాశం దక్కిందని కూడా మండిపడ్డారు.
అయితే ఈ విమర్శలకు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ సమాధానమిచ్చాడు. న్యూజిలాండ్తో రెండో వన్డే నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన సితాన్షు కోటక్.. భారత్-ఏ తరఫున మెరుగైన ప్రదర్శన చేయడంతోనే బదోనిని తీసుకున్నామని స్పష్టం చేశాడు. ఐపీఎల్లోనూ అతను మెరుగ్గా రాణించాడని గుర్తు చేశాడు.

'ఆయుష్ బదోని మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతను భారత్-ఏ తరఫున అద్భుతంగా ఆడాడు. వాషింగ్టన్ సుందర్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. కేవలం ఐదుగురు బౌలర్లతోనే ఆడలేం. గత మ్యాచ్లో భారత్ ఐదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగి ఉంటే.. సుందర్ గాయం తర్వాత బౌలింగ్ చేసేవారు ఎవరు? అందుకే ప్రతి జట్టు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్తో బరిలోకి దిగుతున్నాయి. ఆయుష్ బదోని భారత్-ఏ తరఫున రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అతను బౌలింగ్ కూడా చేయగలడు. ఐపీఎల్తో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు.'అని సితాన్షు కోటక్ వివరణ ఇచ్చాడు.
27 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో ఆయుష్ బదోని 36.47 సగటుతో 693 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే బౌలింగ్లో 29.72 సగటుతో 18 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించే బదోని 46 ఇన్నింగ్స్ల్లో 963 పరుగులు చేశాడు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
న్యూజిలాండ్తో రెండో వన్డేలో బదోనికి అవకాశం దక్కలేదు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో భారత్ పేస్ ఆల్రౌండర్ అయిన నితీష్ కుమార్ రెడ్డితో బరిలోకి దిగింది. దాంతో బదోనికి నిరాశే ఎదురైంది.