టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఎలాంటి విభేదాలు లేవని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపాడు. గంభీర్తో కోహ్లీ, రోహిత్లకు మంచి సత్సంబంధాలు ఉన్నాయని స్పష్టం చేశాడు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాడు. న్యూజిలాండ్తో రెండో వన్డే నేపథ్యంలో సితాన్షు కోటక్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోహ్లీ, రోహిత్, గంభీర్ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టు ప్రణాళికల్లో భాగంగానే ఉన్నారు. ప్రస్తుతం వారు కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నారు. దాంతో ప్రతీ మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నారు. వారికి ఉన్న అపారమైన అనుభవాన్ని ఇతర ఆటగాళ్లతో పంచుకుంటున్నారు. తరుచూ సహచర ఆటగాళ్లతో మాట్లాడుతూ కనిపిస్తున్నారు. వన్డే ఫార్మాట్ గురించి, భారత్కు ఉన్న మ్యాచ్లు, సౌతాఫ్రికా పర్యటన కోసం జట్టు ప్రణాళికల గురించి గంభీర్తో చర్చిస్తారు.

కోహ్లీ, రోహిత్లు తమ అనుభవాలను పంచుకోవడం నేను చూశాను. వారు ఎప్పుడూ సహచర ఆటగాళ్లతో చర్చిస్తూనే ఉంటారు. సోషల్ మీడియా వచ్చే చాలా విషయాలను నేను పట్టించుకోను. కానీ జట్టులో అంతా సానుకూలంగానే ఉంది. టీ20లకు, వన్డేలకు మధ్య ఇప్పటికీ చాలా వ్యత్సాసం ఉంది. ప్రస్తుతం ప్రతీ మ్యాచ్లోనూ 300 ప్లస్ స్కోర్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా భారత్లో ఎక్కువ 300 ప్లస్ స్కోర్లను చూస్తున్నాం. కొన్నిసార్లు వాటిని ఛేజ్ కూడా చేస్తున్నాం.
టీ20 ప్రపంచకప్ తర్వాత మరిన్ని వన్డేలు ఉంటాయని నేను భావిస్తున్నా. 34 ఓవర్ల తర్వాత కేవలం ఒకే బంతిని ఉపయోగించాలనే కొత్త నిబంధన నేపథ్యంలో ఎలా ఆడాలనే దానిపై ఒక కొత్త పద్దతిని సిద్దం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ ఆటగాడి భవిష్యత్తు గురించి సమాధానం చెప్పడానికి నేను సరైన వ్యక్తిని కాదు. కానీ రవీంద్ర జడేజా ఇంకా ఫిట్గా ఉన్నాడు.అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒక ఆటగాడు మెరుగ్గా రాణిస్తూ ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం.. జట్టు కోసం ఆడి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటారు.'అని సితాన్షు కోటక్ చెప్పుకొచ్చాడు.
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో శుభారంభం చేసిన టీమిండియా.. బుధవారం రాజ్కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డే కోసం సిద్దమవుతుంది. ఇప్పటికే ఇరు జట్లు రాజ్కోట్ చేరి ముమ్మరంగా సాధన చేశాయి.