టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సలహాతోనే రెండు వికెట్లు తీసానని మహమ్మద్ సిరాజ్ తెలిపాడు. స్టంప్ లైన్లో బౌలింగ్ చేయాలని బుమ్రానే సూచించాడని చెప్పాడు. రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్(2/47) రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు ఆట అనంతరం బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన సిరాజ్.. వికెట్ కండిషన్స్ గురించి చెప్పుకొచ్చాడు. పిచ్లో ఒక ఎండ్లో బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉందని తెలిపాడు.
'కొత్త బంతి బ్యాట్పైకి మంచిగా వచ్చింది. కానీ బంతి పాతబడినప్పుడు బౌన్స్ తగ్గింది. దాంతో నేను ఫుల్ లెంగ్త్లో స్టంప్ లైన్లో బౌలింగ్ చేయాలనుకున్నాను. కొంత రివర్స్ స్వింగ్ కూడా లభించింది. ఎప్పుడైనా వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తే.. వికెట్లు లభించే అవకాశాలు ఉంటాయి. బ్యాటర్లకు కూడా పరుగులు చేయడం ఇబ్బంది అవుతుంది. ఈ పిచ్లో ఒక ఎండ్లో బ్యాటింగ్ చేయడానికి బాగానే ఉంది. కానీ మరొక ఎండ్లో అనూహ్య బౌన్స్ ఉంది. పరుగులు చేయడం కష్టంగా మారింది. జస్సీ భాయ్ నాకు చెప్పింది ఏంటంటే.. స్టంప్స్ లైన్లో బౌలింగ్ చేస్తే వికెట్ దొరుకుతుంది.

బ్యాటర్లు ఎల్బీడబ్ల్యూ, బౌల్డ్ అయ్యే అవకాశం ఉండటంతో పాటు కచ్చితమైన లైన్లో వేస్తే క్యాచ్లు కూడా వస్తాయని బుమ్రా చెప్పాడు. ఈ మ్యాచ్లో మేం పట్టు బిగిస్తున్నాం.కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయాం. మార్క్రమ్, రికెల్టన్ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ మేం పుంజుకొని ఆ భాగస్వామ్యాన్ని విడదీసాం. ప్రస్తుతం మేం ఈ మ్యాచ్లో ముందంజలో ఉన్నామని నేను అనుకుంటున్నా.'అని మహమ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో టీమిండియా పట్టుబిగించే దిశగా సాగుతోంది. కోల్కతా వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్ట్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(12) విఫలమైనా.. కేఎల్ రాహుల్59 బంతుల్లో 2 ఫోర్లతో 13 బ్యాటింగ్), వాషింగ్టన్ సుందర్(38 బంతుల్లో 6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్ ఒక వికెట్ తీసాడు. భారత్ ఇంకా 122 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 159 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 31), వియాన్ మల్డర్(51 బంతుల్లో 3 ఫోర్లతో 24), ర్యాన్ రికెల్టన్(22 బంతుల్లో 4 ఫోర్లతో 23), టోనీ డీ జోర్జి(55 బంతుల్లో ఫోర్, సిక్స్తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(5/27) ఐదు వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించాడు. మహమ్మద్ సిరాజ్(2/47), కుల్దీప్ యాదవ్(2/36) రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.