టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్పై న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫినిషర్లలో రింకూ సింగ్ ఒకడని కొనియాడు. ఈపాటికే అతను భారత్ తరఫున 100 టీ20లు ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో భాగంగా నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో రింకూ సింగ్ చెలరేగాడు. తనకే సాధ్యమైన బ్యాటింగ్తో 44 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టుకు అద్భుతమైన ముగింపు అందించాడు.
రింకూ సింగ్ సూపర్ ఫినిష్తో 238 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసిన టీమిండియా 48 పరుగులతో న్యూజిలాండ్ను ఓడించింది. ఈ మ్యాచ్కు కామెంటేటర్గా వ్యవహరించిన సైమన్ డౌల్.. మ్యాచ్ అనంతరం రింకూ సింగ్పై ప్రశంసల జల్లు కురిపించాడు. అతనికి తగిన అవకాశాలు రాలేదని అభిప్రాయపడ్డాడు.
'అత్యుత్తమ ఫినిషర్లలో రింకూ సింగ్ ఒకడు. ఐదేళ్ల క్రితమే ఐపీఎల్ ద్వారా అతను వెలుగులోకి వచ్చాడు. కానీ అతనికి భారత జట్టులో తగిన అవకాశాలు దక్కలేదు. అతను ఇంకా ఎక్కువ మ్యాచ్లు ఆడాల్సింది. ఈపాటికే అతను 100 మ్యాచ్ల మైలురాయి అందుకోవాల్సింది. ఫినిషర్గా రింకూ సింగ్ అవసరం టీమిండియాకు ఉంది. ఎందుకంటే ఫినిషర్గా ఆ బాధ్యతను అతను అద్భుతంగా నిర్వర్తించగలడు.

అతను ఎత్తు తక్కువగా ఉన్నప్పటికీ.. చాలా శక్తివంతుడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడటం అతని ప్రత్యేకత. అతనికి బౌలింగ్ చేయడం బౌలర్లకు కష్టంగా మారుతుంది.'అని సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు. 2023లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రింకూ సింగ్.. ఇప్పటి వరకు భారత్ తరఫున 36 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 జట్టులో చివరి నిమిషంలో అతను చోటు కోల్పోయాడు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో చోటు దక్కించుకున్న అతను నిలకడగా రాణించి జట్టు విజయాల్లో భాగం కావాలని ఆశిస్తున్నాడు. అయితే వరుసగా అవకాశాలు రాకపోవడం తనకు సమస్యకు మారుతుందని, అనవసర ఒత్తిడిని కలిగిస్తుందని రింకూ సింగ్ అభిప్రాయపడ్డాడు. నిలకడగా అవకాశాలు ఇస్తే మరింత మెరుగ్గా రాణిస్తానని వెల్లడించాడు.