న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మపై న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ విమర్శలు గుప్పించాడు. బయట మాట్లాడుకునేంత సీన్ రోహిత్ శర్మకు లేదని, అతను గొప్ప కెప్టెన్ కాదన్నాడు. అత్యుత్తమ జట్టు దొరకడం వల్లే రోహిత్.. ఐపీఎల్లో ఐదు టైటిళ్లు గెలవగలిగాడని చెప్పాడు. టైటిళ్లు గెలవడంలో అతని గొప్పతనం ఏం లేదని విమర్శించాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో రోహిత్ శర్మ పేలవ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ కామెంటేటర్గా వ్యవహరిస్తున్న సైమన్ డౌల్ రోహిత్ శర్మ ఆట తీరును విమర్శించాడు. 'రోహిత్ శర్మ కెప్టెన్సీపైన ఎందుకు ఇంత హైప్ వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. అతను మంచి కెప్టెనే కావచ్చు కానీ గొప్ప కెప్టెన్ మాత్రం కాదు. ఎందుకంటే అతనికి బెస్ట్ టీమ్ దొరికింది, టైటిల్స్ గెలిచాడు.

గత సీజన్ నుంచి రోహిత్ శర్మకు ఏం అర్థం కావడం లేదు. కెప్టెన్గా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఐపీఎల్లోనే కాదు.. భారత్ తరఫున ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ రోహిత్ కెప్టెన్గా విఫలమయ్యాడు. ఈ సీజన్లో కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీ అలాగే ఉంది. ఇలాంటి పర్ఫామెన్స్తో ప్లేఆఫ్స్ చేరడం కష్టమే.'అని సైమన్ డౌల్ చెప్పుకొచ్చాడు.
ఈ సీజన్లో ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ 191 పరుగులే చేశాడు. గత నాలుగు ఇన్నింగ్స్ల్లో రెండు సార్లు డకౌటయ్యాడు. గతేడాది వరుస పరాజయాలతో పాయింట్స్ టేబుల్లో చివరి స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ సారి కూడా ఆరంభంలో తడబడింది.
సెకండాఫ్ లీగ్లో ముంబై ఆటగాళ్లందరూ ఫామ్లోకి రావడంతో వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో నిలిచింది. మంగళవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్తో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముంబై పాయింట్స్ టేబుల్లో మూడో స్థానానికి దూసుకెళ్లింది.