జింబాబ్వే ఆల్రౌండర్ సికందర్ రాజా ఆల్టైమ్ అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించాడు. అంతర్జాతీయ టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో ఈ జట్టును ఎంపిక చేశాడు. ఈ ఆల్టైమ్ టీ20 ఎలెవన్కు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను సారథిగా ఎంపిక చేశాడు. భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లు ఈ జట్టులో చోటు దక్కించుకోగా.. సౌతాఫ్రికా నుంచి ఇద్దరూ, వెస్టిండీస్ నుంచి ముగ్గురు, ఆసీస్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల నుంచి ఒక్కో ఆటగాడు ఎంపికయ్యాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ 125 మ్యాచ్లు ఆడి 46.69 సగటుతో 4,188 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20 ఫార్మాట్లో విరాట్ కోహ్లీ ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్లు ఆడాడు. టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం కోహ్లీ ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. ఫ్రాంచైజీ క్రికెట్లోనూ కోహ్లీకి తిరుగులేదు. నిలకడకు మారుపేరైనా కోహ్లీ పేరు ఆల్టైమ్ టీ20 ఎలెవన్లో లేకపోవడాన్ని అతని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.

కెప్టెన్గా అరంగేట్ర టీ20 ప్రపంచకప్ గెలవడంతో పాటు ఫినిషర్గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ధోనీకి కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టు ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మను ఎంపిక చేసిన సికిందర్ రాజా.. వికెట్ కీపర్గా నికోలస్ పూరన్ను ఎంచుకున్నాడు. ఏబీ డివిలియర్స్, హెన్రీచ్ క్లాసెన్, కీరన్ పొలార్డ్ ఫినిషర్లుగా ఎంచుకున్న సికిందర్ రాజా.. ఆల్రౌండర్గా జడేజాను, స్పెషలిస్ట్ స్పిన్నర్గా రషీద్ ఖాన్ను తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, షాహిద్ అఫ్రిదిలను పేసర్లుగా ఎంచుకున్నాడు.