భారత్ను తక్కువ స్కోర్కు కట్టడి చేసి ఉంటే విజయం సాధించేవాళ్లమని జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అన్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం తమ ఓటమిని శాసించాయని తెలిపాడు. అయితే తమ జట్టులో కుర్రాళ్లు ఎక్కువగా ఉన్నారని, భారత్లో ఆడిన అనుభవం వారికి లేదని చెప్పాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా 72 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. ఈ ఓటమితో సెమీస్ రేసు నుంచి జింబాబ్వే నిష్క్రమించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సికందర్ రజా .. మూడు విభాగాల్లో తమ జట్టు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే ఈ మ్యాచ్లో ఓడినా తమ బ్యాటింగ్ ప్రదర్శన సంతృప్తినిచ్చిందని చెప్పాడు. భారత్ను 210-220 పరుగులకు కట్టడి చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు.

'వెస్టిండీస్తో గత మ్యాచ్లో 250 పరుగులు ఛేజ్ చేసే క్రమంలో మా బ్యాటింగ్ లైనప్లో కాస్త తొందరపాటు కనిపించింది. కానీ ఈరోజు మొదటి ఆరు ఓవర్లలో మేం చాలా సంయమనంతో ఆడి మాకు మేం ఒక అవకాశం ఇచ్చుకున్నాం. బౌలింగ్లో మా డిఫెన్సివ్ ప్లాన్స్ను ఇంకాస్త మెరుగ్గా అమలు చేసి ఉండాల్సింది. ఒక్కసారి పరుగుల వేగం పుంజుకుంటే.. ఆపడం కష్టం. భారత్ను 210-220 పరుగులకు పరిమితం చేసి ఉంటే ఫలితం ఎలా ఉండేదో చెప్పలేం.
బౌలింగ్, ఫీల్డింగ్లో మేం ఇంకా మెరుగ్గా రాణించాల్సింది. భారీ లక్ష్యాన్ని ఎలా ఛేజ్ చేయాలో గత మ్యాచ్ మాకు నేర్పింది. సాకులు చెప్పడం లేదు కానీ.. మా జట్టులో చాలా మంది యువకులు ఉన్నారు. వారు తమ మొదటి ప్రపంచ కప్ ఆడుతున్నారు. అలాగే భారత్లో ఆడటం కూడా వారికి ఇదే తొలిసారి. ఫీల్డింగ్లో మెరుగైన ప్రదర్శనను ఆశిస్తున్నాను. బ్యాటింగ్ ఇలాగే ఉంటే బాగుంటుంది. చిన్న పొరపాటు జరిగినా మ్యాచ్ చేజారిపోతుంది. మేం మూడు విభాగాలను చక్కదిద్దుకుంటే జట్టుగా ఇంకా బాగుంటుంది.'అని సికందర్ రజా అభిప్రాయపడ్డాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 50 నాటౌట్), అభిషేక్ శర్మ(30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 55) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించగా.. తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 44 నాటౌట్), ఇషాన్ కిషన్(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 38), సూర్యకుమార్ యాదవ్(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 50 నాటౌట్) దూకుడుగా ఆడారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రెస్సింగ్ ముజుర్బాని, మపోసా, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు.
అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓటమిపాలైంది. బ్రియాన్ బెన్నిట్(59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 85 నాటౌట్)తన జోరు కొనసాగించగా.. కెప్టెన్ సికిందర్ రాజా(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/22) మూడే వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసారు.
