
మిట్ట మధ్యాహ్నం ప్రాక్టీస్..
అండర్-19 జట్టులోని మిగతా ఆటగాళ్లందరి కుటుంబ సభ్యులకు కాస్తో కూస్తో క్రీడలకు సంబంధించిన నేపథ్యమో లేక ఆర్థిక బలమో ఉన్నది. కానీ సిద్దార్థ్ యాదవ్కు మాత్రం తండ్రి ఆశయం ఒక్కటే వారసత్వంగా వచ్చింది. క్రికెటర్ కావాలనే కలను శ్రవణ్ యాదవ్ తన కొడుకు ద్వారా తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడెప్పుడో నెట్స్లో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ ప్రభాకర్కు బౌలింగ్ చేసిన శ్రవణ్ యాదవ్కు క్రికెట్ గురించి పెద్దగా ఏం తెలియకపోయినా.. ఆటపై మక్కువ మాత్రం ఎక్కువే. అందుకే తన కొడుకును క్రికెటర్గా మార్చాలనుకున్నాడు.
అయితే అందరూ వేకువజామున లేదంటే సాయంత్రం వేళలో ప్రాక్టీస్ చేస్తే.. శ్రవణ్ యాదవ్ మాత్రం తన కొడుకుకు మిట్ట మధ్యాహ్నం క్రికెట్ ఓనమాలు నేర్పేవాడు. తన చిల్లర కొట్టును మధ్యాహ్నం 2 గంటలకు మూసేసి.. సమీప మైదానంలో 6 గంటల వరకు త్రోడౌన్స్ వేస్తూ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించేవాడు. ఆ తర్వాత వచ్చి మళ్లీ షాప్ చూసుకునేవాడు.

ఎడమచేతి బ్యాటింగ్తో...
అయితే సిద్దార్థ్కు 8 ఏళ్ల వయసులో బ్యాట్ కొనివ్వగా.. అతను ఎడమచేతిలో బ్యాట్ పట్టుకొని ఆడటంతో శ్రవణ్కు మరింత నచ్చింది. సిద్దార్థ్ నాయనమ్మ బ్యాట్ను తప్పుగా పట్టుకుంటున్నాడని మందలించినా.. అదే సరైందని సర్ధి చెప్పానని శ్రవణ్ యాదవ్ గుర్తు చేసుకున్నాడు. '8 ఏళ్ల వయసులో సిద్దార్థ్ తొలి బ్యాట్ పట్టుకున్నాడు. లెఫ్టాండర్గా నిలబడ్డాడు. ఆ క్షణమే నా కల నేరవేరినట్లు అనిపించింది. మా అమ్మ అది తప్పని వారించినా అదే కరెక్ట్ అని చెప్పా'అని శ్రవణ్ యాదవ్ తెలిపాడు. అయితే సిద్ధార్థ్కు క్రికెట్ నేర్పించడం తన ఇంట్లో వాళ్లెవరికీ ఇష్టం లేదని శ్రవణ్ చెప్పుకొచ్చాడు. సిద్దార్థ్ నాయనమ్మ అయితే చదువు దృష్టిసారించాలని తిట్టేదంట. మనవడి కెరీర్ నాశనం చేస్తున్నాడని అతని కొడుకుపై కూడా కోప్పడేదట.

అండర్-16 జట్టు తరఫున..
సిద్దార్థ్ కెరీర్ పురోగతిలో ఇద్దరూ అజయ్లు కీలక పాత్ర పోషించారు. మరో అండర్-19 క్రికెటర్ ఆరాధ్య యాదవ్ తండ్రి అజయ్ యాదవ్, భారత మాజీ క్రికెటర్ అజయ్ శర్మ ఇద్దరూ సిద్దార్థ్కు అండగా నిలిచారు. అండర్-16 ట్రయల్స్ సమయంలో సిద్దార్థ్ తండ్రి ఓ మంచి కోచ్ను సూచించాలని అజయ్ యాదవ్ కోరాడట. ఆయన అజయ్ శర్మకు రిఫెర్ చేయగా.. సిద్దార్థ్ యాదవ్ అక్కడే కోచింగ్ తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ అండర్-16 జట్టుకు సెలెక్ట్ అయిన సిద్దార్థ్.. ఆ సీజన్లో హయ్యెస్ట్ స్కోరర్గా నిలిచాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీతో పాటు ఐదు సెంచరీలున్నాయి. ఆ పెర్ఫామెన్స్తో అతను జోనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు. ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో చోటు దక్కించుకున్నాడు.

అండర్-19 చాలెంజర్స్ ట్రోఫీలో..
కరోనా కారణంగా దేశవాళీ క్రికెట్ జరగకపోవడంతో.. ప్రపంచకప్ జట్టు కోసం బీసీసీఐ అండర్-19 చాలెంజర్స్ ట్రోఫీ నిర్వహించింది. ఈ టోర్నీలో సిద్దార్థ్ సెకండ్ హయ్యెస్ట్ రన్నర్గా నిలిచాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలు బాదాడు. బంగ్లాదేశ్తో జరిగిన ట్రై సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన సిద్దార్థ్.. ఓ మ్యాచ్లో 43 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పుడే తన కెరీర్ను మొదలుపెట్టిన సిద్దార్థ్ చాలా సాధారణంగా వ్యక్తి. ఇతర క్రికెటర్లలా అతనికి కనీసం మొబైల్ ఫోన్, ఇతర గాడ్జెట్స్ కూడా లేవు.


Click it and Unblock the Notifications












