ఇంగ్లండ్తో రెండో టెస్ట్ తొలి రోజు ఆటలో టీమిండియా గట్టెక్కింది. ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా బుధవారం ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు తమ జోరును కొనసాగించారు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 85 ఓవర్లలో 5 వికెట్లకు 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(216 బంతుల్లో 12 ఫోర్లతో 114 బ్యాటింగ్) అజేయ శతకం చెలరేగగా.. యశస్వి జైస్వాల్(107 బంతుల్లో 13 ఫోర్లతో 87) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో శుభ్మన్ గిల్తో పాటు రవీంద్ర జడేజా(67 బంతుల్లో 5 ఫోర్లతో 41 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్(2/59) రెండు వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ తలో వికెట్ తీసారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినా.. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా సూపర్ బ్యాటింగ్తో తొలి రోజు ఆటలో టీమిండియా గట్టెక్కింది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కేఎల్ రాహుల్(26 బంతుల్లో 2) ఆచితూచి ఆడే ప్రయత్నంలో క్రిస్ వోక్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో 15 పరుగులకే టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో కరుణ్ నాయర్తో కలిసి యశస్వి జైస్వాల్ జట్టును ఆదుకున్నాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ వచ్చిన కరుణ్ నాయర్ సాయంతో యశస్వికి సహకారం అందించాడు. దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్ 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సాధికారికంగా ఆడుతున్న కరుణ్ నాయర్(31)ను బ్రైడన్ కార్స్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానిక తెరపడింది. క్రీజులోకి శుభ్మన్ గిల్ రాగా..టీమిండియా 98/2 స్కోర్తో లంచ్ బ్రేక్కు వెళ్లింది.

రెండో సెషన్లోనూ యశస్వి జైస్వాల్ తన జోరును కొనసాగించగా.. గిల్ ఆచితూచి ఆడాడు. వేగంగా ఆడే ప్రయత్నం చేసిన యశస్వి జైస్వాల్ సెంచరీ దిశగా సాగాడు. కానీ అతన్ని స్టోక్స్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చి.. 66 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. బ్యాటింగ్కు వచ్చిన రిషభ్ పంత్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేయడంతో టీమిండియా వేగంగా పరుగులు చేసింది. దాంతో భారత్ 182/3 స్కోర్తో టీ బ్రేక్కు వెళ్లింది.
మూడో సెషన్ ఆరంభంలోనే గిల్ 125 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ కాసేపటికే పంత్.. భారీ సిక్సర్ కొట్టే ప్రయత్నంలో షోయబ్ బషీర్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో నాలుగో వికెట్కు నమోదైన 48 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. నితీష్ కుమార్ రెడ్డి(1)ని క్రిస్ వోక్స్ స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో 211 పరుగులకే టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో జడేజాతో కలిసి గిల్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడిన ఈ ఇద్దరూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. జోరూట్ వేసిన 80వ ఓవర్ ఆఖిరి బంతిని బౌండరీకి తరలించిన శుభ్మన్ గిల్.. 199 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్కు ఇది ఏడో టెస్ట్ సెంచరీ కాగా.. ఈ సిరీస్లో వరుసగా రెండో శతకం. ఆ తర్వాత ఆచితూచి ఆడిన గిల్-జడేజా అజేయంగా 99 రన్స్ జోడించి తొలి రోజు ఆటను ముగించారు.