భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్ల్లో ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ వేడెక్కింది. మూడో రోజు ఆట ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం మొదలైంది. ఇంగ్లండ్ ఓపెనర్లు అతి తెలివిని ప్రదర్శించడంతో టీమిండియా ఆటగాళ్లు ధీటుగా బదులిచ్చారు. విరాట్ కోహ్లీ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ తగ్గేదేలే అంటూ ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. బూతు పదాలతో జాక్ క్రాలీని తిట్టాడు. మహమ్మద్ సిరాజ్ తన నోటికి పనిచెప్పాడు. ఇతర ఆటగాళ్లంతా ఇంగ్లండ్ ఓపెనర్ల అతి తెలివిని ఎగతాళి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
145/3 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. జస్ప్రీత్ బుమ్రా బంతిని అందుకున్నాడు. అయితే ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్గా తెలివిగా సమయాన్ని వృథా చేసే ప్రయత్నం చేశారు. ఆట ముగిసే సమయం ఆసన్నం కావడంతో ఎక్కువ ఓవర్లు ఆడకుండా ఉండేందుకు ప్రయత్నించారు. బుమ్రా రన్నప్ పూర్తి చేసిన తర్వాత ఆపడం.. చిన్న గాయానికి ఫిజియోలను పిలవడం వంటి పనులు చేశారు.

ఈ పనులతో తీవ్ర అసహనానికి గురైన భారత ఆటగాళ్లు నోటికి పనిచెప్పారు. కాస్త ధైర్యం చూపించు అంటూ శుభ్మన్ గిల్.. బూతు పదాలతో జాక్ క్రాలీతో వాగ్వాదానికి దిగాడు. అతనిపైకి దూసుకెళ్లాడు. 'కాస్త మీ మగతనాన్ని చూపించండి’అని రాయలేని పదాలతో తిట్టాడు. మరోవైపు సిరాజ్ తన మాటలతో స్లెడ్జింగ్కు దిగాడు. ఇతర భారత ఆటగాళ్లంతా జాక్ క్రాలీ చుట్టూ చేరి చప్పట్లతో ఎగతాళి చేశారు. భారత ఆటగాళ్ల చర్యలను పట్టించుకోని జాక్ క్రాలీ ఆచితూచి ఆడి బుమ్రా ఓవర్ను ముగించాడు. ఆ వెంటనే అంపైర్లు ఆటను నిలిపేసారు.
ఈ చర్యలతో ఆదివారం ఆట రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్దం నడవనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కూడా తొలి ఇన్నింగ్స్లో 387 పరుగులే చేయడంతో ఇరు జట్ల స్కోర్లు సమమై ఎవరికీ ఆధిక్యం దక్కలేదు. నాలుగో రోజు ఆట తొలి సెషన్లో భారత బౌలర్లు తీసే వికెట్లపై ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ను త్వరగా ఆలౌట్ చేస్తే ఈ మ్యాచ్పై టీమిండియా పట్టు బిగించవచ్చు. లేదంటే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది.