విరాట్ కోహ్లీ రిటైర్మెంట్తో ఖాళీ అయిన నాలుగో స్థానంలోనే తాను బ్యాటింగ్ చేస్తానని టీమిండియా నయా కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీ లేని లోటును పూడ్చడం కష్టమని, ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేస్తానని తెలిపాడు. ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా.. ఐదు టెస్ట్ల సిరీస్కు సిద్దమైంది. శుక్రవారం లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్ట్తో ఈ సిరీస్కు తెరలేవనుంది. డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్ కూడా ఈ సిరీస్తోనే ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకడంతో టీమిండియా టెస్ట్ సారథ్య బాధ్యతలు శుభ్మన్ గిల్కు దక్కాయి. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్తోనే గిల్ కెప్టెన్సీ కెరీర్ ప్రారంభం కానుంది.
తొలి టెస్ట్ నేపథ్యంలో శుభ్మన్ గిల్ గురువారం మీడియాతో మాట్లాడాడు. ఈ సిరీస్ కోసం తాను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ప్రత్యేకంగా కలిసానని, ఇక్కడి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నానని వెల్లడించాడు. 'దేశానికి సారథ్యం వహించడం ఏ ఆటగాడికైనా దక్కే అత్యున్నత గౌరవం. టీమిండియా సారథ్య బాధ్యతలు దక్కడం సంతోషంగా ఉంది. కోహ్లీ రిటైర్మెంట్తో ఖాళీ అయిన నాలుగో స్థానంలో నేను బ్యాటింగ్ చేస్తాను. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. కెప్టెన్గా జట్టులో మంచి వాతావరణాన్ని సృష్టించడంపై ఫోకస్ పెట్టాను. యువ ఆటగాళ్లకు అండగా నిలవడం.. వారు నిలకడగా రాణించేలా ప్రోత్సహించడం కెప్టెన్గా నా లక్ష్యం.

తుది జట్టు కూర్పుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే రెండు, మూడు కాంబినేషన్స్ను సిద్దం చేసుకున్నాం. పిచ్ కండిషన్స్ను బట్టి తుది నిర్ణయం తీసుకుంటాం. ఇంగ్లండ్లోని వాతావరణం పిచ్పై ప్రభావం చూపుతుంది. రోహిత్, విరాట్ కోహ్లీలతో నేను మాట్లాడాను. ఐపీఎల్ సందర్భంగా వారిని కలిసాను. ఇంగ్లండ్లోని తమ అనుభవాలను వారు నాతో పంచుకున్నారు. ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో మేం ఆడబోయే బ్రాండ్ ఆఫ్ క్రికెట్ గురించి తెలియాలంటే ఆగస్ట్ వరకు ఆగాల్సిందే. ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం అనేది ఐపీఎల్ టైటిల్ కంటే ఎక్కువ. ఐపీఎల్ ప్రతీ ఏడాది జరుగుతుంది. కానీ విదేశీ గడ్డపై కెప్టెన్గా సిరీస్ గెలిచే అవకాశం తరుచుగా రాదు.'అని శుభ్మన్ గిల్ నవ్వుతూ సమాధానమిచ్చాడు.