డెత్ ఓవర్ల వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం స్పందించిన శుభ్మన్ గిల్.. చివరి ఓవర్లలో ధారళంగా పరుగులు ఇవ్వడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.
'ఈ మ్యాచ్లో ఓడినా మేం అద్బుతమైన క్రికెట్ ఆడాం. విజయం కోసం చివరి వరకు పోరాడి ఓటమిపాలవ్వడం తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ జట్టులోని ప్రతీ ఒక్కరు అద్భుతంగా పోరాడారు. చివరి వరకు విజయం కోసం ప్రయత్నించారు. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధిస్తున్నప్పుడు ప్రణాళికలతో బ్యాటింగ్ చేసే అవకాశం ఉండదు. క్రీజులోకి అడుగుపెడుతూనే భారీ షాట్స్ ఆడాల్సి ఉంటుంది. భారీ లక్ష్యచేధనలో ఇంపాక్ట్ ప్లేయర్స్ కీలకం అవుతారు. ఎక్స్ట్రా బ్యాటర్ రూపంలో ఇంపాక్ట్ ప్లేయర్ ఇతర ప్లేయర్లకు స్వేచ్చగా బ్యాటింగ్ చేసే అవకాశం కల్పిస్తాడు.
అయితే మేం ఢిల్లీని 200-210 పరుగులకు కట్టడి చేస్తామని భావించాం. కానీ చివరి 2-3 ఓవర్లలో ధారళంగా పరుగులిచ్చుకున్నాం. అయితే ఇది చాలా చిన్నమైదానం. ఇక్క పరుగులు రావడం సులువే. భారీ లక్ష్యచేధనలో ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడం చాలా ముఖ్యం. అయితే సెటిల్ బ్యాటర్ చివరి వరకు ఉంటేనే విజయం సులువు అవుతోంది. ఇలాంటి పిచ్లపై యార్కర్లతో పాటు వేరియేషన్స్తో బౌలింగ్ ప్రణాళికలను సిద్దం చేసుకోవాలి.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
