టీ20 ఫార్మాట్లో పర్ఫెక్ట్ గేమ్ ఆడలేమని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. పొట్టి ఫార్మాట్లో తప్పులు జరగడం సహజమని అభిప్రాయపడ్డాడు. తప్పులు చేసినా విజయాలు సాధించాలని, ఆ విషయంలో తమ జట్టు మెరుగ్గానే ఉందని సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. గుజరాత్కు ఇది ఆరో విజయం కావడంతో పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శుభ్మన్ గిల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. వెంకటేశ్ అయ్యర్ వికెట్ అనంతరం.. భావోద్వేగాలను అదుపు చేసుకోలేకనే గట్టిగా సంబరాలు చేసుకున్నానని చెప్పాడు.

అలా ఎప్పుడూ చెప్పలేదు..
'వరుసగా రెండు మ్యాచ్లు గెలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రెండు మ్యాచ్లే పాయింట్స్ టేబుల్లో మా స్థానాన్ని నిర్ణయిస్తుందని మేం చర్చించుకున్నాం. వరుసగా ఈ రెండు మ్యాచ్లు గెలవడం సంతోషంగా ఉంది. మేం మా అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగించాలనుకుంటున్నాం. మేం ఎప్పుడూ ఒక బ్యాటర్ చివరి వరకు క్రీజులో ఉండాలని మాట్లాడుకోలేదు. ఇలాంటి కండిషన్స్లో పరుగులు ఎలా చేయాలి? మ్యాచ్ను చివరి వరకు ఎలా తీసుకెళ్లాలి? అనే విషయాలు మాత్రమే చర్చించుకున్నాం. ఈ గేమ్లో మేం చాలా ముందున్నాం. అయితే మ్యాచ్లో పైచేయి సాధించడం ఒక ఎత్తు అయితే.. మ్యాచ్ను ముంగించడం మరో ఎత్తు.
ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకనే..
భావోద్వేగాలను అదుపు చేసుకోలేకనే వెంకటేశ్ అయ్యర్ వికెట్ అనంతరం గట్టిగా సంబరాలు చేసుకున్నాను. ఈ ఫార్మాట్లో పర్ఫెక్ట్ గేమ్ ఆడటం చాలా కష్టం. ఎంత బాగా ఆడినా.. తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఈ రోజు కూడా మేం 10 పరుగులు తక్కువగా చేశాం. నేను క్రీజులో ఉంటే ఆ రన్స్ వచ్చేవి. బౌలింగ్లోనూ కొన్ని తప్పిదాలు జరిగాయి. కానీ తప్పిదాలు జరిగినా.. పర్ఫెక్ట్ గేమ్ ఆడకపోయినా విజయానికి బాటలు వేసుకోవాలి. ఆ విషయంలో మేం మెరుగ్గానే ఉన్నాం.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
శుభ్మన్ గిల్ విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 90), సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జోస్ బట్లర్(23 బంతుల్లో 8 ఫోర్లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులే చేసింది. అజింక్యా రహానే(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 50) మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్ తలో వికెట్ తీయగా.. ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.