పిచ్ కండిషన్స్ తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేసి విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా జింబాబ్వేతో బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 66) హాఫ్ సెంచరీతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్(28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 49), యశస్వి జైస్వాల్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని(2/25), సికందర్ రాజా(2/24) రెండేసి వికెట్లు తీసారు. అనంతరం జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసి ఓటమిపాలైంది. డియోన్ మైర్స్(49 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 65 నాటౌట్), క్లైవ్ మదండే(26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 37) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్(3/15) వికెట్లు తీయగా..ఆవేశ్ ఖాన్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్(1/15) ఓ వికెట్ తీసాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై సంతోషం వ్యక్తం చేసిన శుభ్మన్ గిల్.. జట్టులోని ప్రతీ ఒక్కరూ రాణించడం శుభసూచకమన్నాడు.
'కీలకమైన ఈ మ్యాచ్లో గెలవడం చాలా సంతోషంగా ఉంది. బ్యాట్, బంతితో మేం ఆరంభించిన తీరు బాగుంది. వికెట్ కొంచెం డబుల్ పేస్గా ఉంది. దాంతో ఆడ్ బాల్ కాస్త గ్రిప్ అయ్యింది. లెంగ్త్ బాల్స్ ఆడటం కష్టమైంది. మా బౌలర్లతో నేను ఇదే చర్చించాను.
ఈ పిచ్లో ఏదో ఉందనే విషయం మాకు తెలుసు. కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంది. బంతి పాతబడుతున్నా కొద్దీ పరుగులు చేయడం సులువైంది. జట్టులోని ప్రతీ ఒక్కరూ రాణించడం శుభసూచకం.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.