
న్యూఢిల్లీ: తన అరంగేట్ర వన్డే మ్యాచ్లో విఫలమైన తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్న మాటలను యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ గుర్తు చేసుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్లో 9 పరుగులకే ఔటై తీవ్ర బాధలో ఉన్న తనను ధోనీ నవ్వించాడని చెప్పాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న శుభ్మన్ గిల్.. టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసేందుకు సిద్దమవుతున్నాడు. 2019లో న్యూజిలాండ్ వేదికగానే అంతర్జాతీయ వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన శుభ్మన్ గిల్.. ధోనీ చేతుల మీదుగానే అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు. ఆ మ్యాచ్లో 9 పరుగులకే ఔటై వెనుదిరగ్గా.. ధోనీ వచ్చి తనను ఎంకరేజ్ చేశాడని చెప్పాడు. ధోనీ కంటే తన అరంగేట్రమే బాగుందని, తాను డౌకట్ అయిన విషయాన్ని చెబుతూ నవ్వులు పూయించాడని శుభ్మన్ తెలిపాడు.
సోనమ్ బజ్వా హోస్ట్గా వ్యహరిస్తున్న ఓ చాట్షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 'నా అరంగేట్ర మ్యాచ్లో జట్టు స్కోర్ 15 పరుగులుండగా ఔటయ్యాం. నేను కేవలం 9 పరుగులే చేశా. బయట కూర్చొని అరంగేట్ర మ్యాచ్ విఫలమైనందుకు బాధపడుతున్నా. ధోనీ భాయ్ నా దగ్గరకు వచ్చి నేను బాధపడుతున్న విషయాన్ని గ్రహించాడు. అప్పుడు నా వయసు 18-19 ఏళ్లు మాత్రమే. ధోనీ భాయ్ నాతో మాట్లాడుతూ.. 'నా కంటే నీ అరంగేట్రం నయం. నువ్వు 9 పరుగులైనా చేశావ్. నేనయితే గోల్డెన్ డకౌటయ్యా'అని చెప్పాడు. ధోనీ భాయ్ అరంగేట్ర మ్యాచ్లో తొలి బంతికే ఔటయ్యాడనే విషయం నాకు గుర్తొచ్చింది. అయితే ఈ మాట చెబుతూ ధోనీ నవ్వగా.. నేను కూడా నవ్వాను. ధోనీ చెప్పిన ఆ మాటలు నా గుండెకు హత్తుకున్నాయి.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
2004 బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ధోనీ.. ఎదుర్కొన్న తొలి బంతికే రనౌటయ్యాడు. నాన్స్ట్రైకర్తో సమన్వయలోపం కారణంగా ధోనీ గోల్డెన్ డక్గా వెనుదిరిగాల్సి వచ్చింది. కాకతాళీయమో ఏమో కానీ ధోనీ ఆడిన చివరి వన్డేలోనూ రనౌటయ్యాడు. న్యూజిలాండ్తో జరిగిన 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ధోనీ రనౌటైన విషయం తెలిసిందే. అదే అతని కెరీర్లో చివరి వన్డే మ్యాచ్ అయ్యింది. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన ధోనీ.. ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు.