ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో ఓడినా.. తమ జట్టు పోరాడిన తీరు సంతృప్తినిచ్చిందని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో సమష్టిగా విఫలమైన టీమిండియా డక్వర్త్ లూయిస్ ప్రకారం 7 వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. పదే పదే వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. ఇది టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన శుభ్మన్ గిల్.. తమ బ్యాటింగ్ అప్రోచ్ను సమర్థించుకున్నాడు. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోవడంతో కాస్త తగ్గి ఆడాల్సి వచ్చిందన్నాడు. టాప్-3 బ్యాటర్ల వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని పరోక్షంగా వెల్లడించాడు. తనతో సహా రోహిత్, కోహ్లీలు వెనువెంటనే ఔటవ్వడంతో టీమిండియా వెనుకంజలో పడిందని చెప్పాడు. ఈ మ్యాచ్లో ఓడినా చాలా సానుకూల అంశాలు ఉన్నాయని, ఈ పరాజయం నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని గిల్ తెలిపాడు.

'ఓవర్కాస్ట్ కండిషన్స్లో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోతే.. ఎవరైనా క్యాచ్ అప్ గేమ్ ఆడుతారు. ఈ మ్యాచ్ నుంచి మేం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ మ్యాచ్లో ఓడినా మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. 130 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాం. మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లకపోయినా.. చాలా డీప్గా తీసుకెళ్లాం. ఈ ప్రదర్శనతో మేం చాలా సంతృప్తిగా ఉన్నాం.
మేం చాలా అదృష్టవంతులం. అభిమానులు భారీ సంఖ్యలో హాజరై అండగా నిలిచారు. అడిలైడ్ మ్యాచ్కు కూడా ఇదే తరహాలో హాజరవుతారని ఆశిస్తున్నా.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు. వన్డే కెప్టెన్సీని శుభ్మన్ గిల్ ఓటమితో ప్రారంభించాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 26 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 38), అక్షర్ పటేల్(38 బంతుల్లో 3 ఫోర్లతో 31), నితీష్ కుమార్ రెడ్డి(11 బంతుల్లో 2 సిక్సర్లతో 19 నాటౌట్) మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(0) తీవ్రంగా నిరాశపర్చారు. ఆసీస్ బౌలర్లలో జోస్ హజెల్ వుడ్(2/20), మిచెల్ ఓవెన్(2/20), మాథ్యూ కుహ్నేమన్(2/14) రెండేసి వికెట్లు తీయగా.. మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసారు.
డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 26 ఓవర్లలో 131 పరుగులుగా నిర్ణయించారు. ఆసీస్ 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ మిచెల్ మార్ష్(52 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 46 నాటౌట్), జోష్ ఫిలిప్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 37), మ్యాట్ రేన్షా(24 బంతుల్లో ఫోర్, సిక్స్తో 21 నాటౌట్) రాణించారు.
భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీసారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన రోహిత్ శర్మ(8), విరాట్ కోహ్లీ(0) వైఫల్యం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఆరంభంలోనే ఈ ఇద్దరూ ఔటవ్వడంతో జట్టుపై అదనపు ఒత్తిడి పడింది. వర్షం కూడా టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే గురువారం(అక్టోబర్ 23) జరగనుంది.