
పోర్ట్ఆఫ్ స్పెయిన్: వెస్టిండీతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్(98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 98 నాటౌట్) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ను 36 ఓవర్లకే కుదించడంతో గిల్ తన తొలి సెంచరీని అందుకోలేకపోయాడు. అయితే మరో ఒక్క ఓవర్ ఆడే అవకాశం ఉన్నా తాను సెంచరీ చేసేవాడినని మ్యాచ్ అనంతరం గిల్ తెలిపాడు. తృటిలో సెంచరీ చేజార్చుకోవడం చాలా బాధగా ఉందన్నాడు. తొలి రెండు మ్యాచ్ల్లో ఔటైన తీరు నిరాశకు గురి చేసిందన్నాడు. దాంతో ఎలాగైనా సెంచరీ చేయాలనే పట్టుదలతోనే చివరి మ్యాచ్లో బరిలోకి దిగానని కానీ వర్షం కారణంగా సాధించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదేమైనా తన ప్రదర్శన పట్ల సంతోషంగా ఉందని శుభ్మన్ వెల్లడించాడు.
'ఈ మ్యాచ్లో సెంచరీ చేయాలనుకున్నాను. కానీ, వర్షం అనేది నా చేతుల్లో లేనందున ఏమీ చేయలేకపోయాను. ఈ సిరీస్లో తొలి రెండు వన్డేల్లో నేను ఔటైన తీరుతో తీవ్ర నిరాశకు గురయ్యా. ఈ నేపథ్యంలోనే మూడో వన్డేలో ఎలాగైనా పట్టుదలగా ఆడాలని నిర్ణయించుకున్నా. ఈ క్రమంలోనే పరిస్థితులకు తగట్లు బ్యాటింగ్ చేశా. సెంచరీ చేస్తానని అనుకున్నా.. అందుకు ఇంకొక్క ఓవర్ మిగిలి ఉంటే సరిపోయేది. 30 ఓవర్లు ముగిసిన తర్వాత బంతి ఆగుతూ వచ్చింది. దాంతోనే వేగంగా ఆడలేకపోయా. ఏదేమైనా నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా.'అని గిల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 36 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ ( 98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 98 నాటౌట్)సెంచరీకి 2 పరుగుల దూరంలో నిలవగా.. శిఖర్ ధావన్(74 బంతుల్లో 7 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం డక్వర్త్ లూయీస్ పద్ధతిన టీమిండియా నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ చేధించలేకపోయింది.
26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో బ్రాండన్ కింగ్ (42), నికోలస్ పూరన్( 42), హోప్(22) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లో యుజ్వేంద్ర చహల్ (4/17) నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణా చెరో వికెట్ పడగొట్టారు.