కుర్రాళ్ల అసాధారణ ప్రదర్శనతోనే జింబాబ్వే గడ్డపై టీ20 సిరీస్ సాధించామని టీమిండియా తాత్కలిక కెప్టెన్ శుభ్మన్ గిల్ అన్నాడు. విదేశాల్లో ఆడిన అనుభవం లేకపోయినా.. తమ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. తొలి మ్యాచ్లో ఎదురైనా ఘోర పరాజయం తర్వాత నేలకు కొట్టిన బంతిలా పుంజుకున్నామని తెలిపాడు.
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన ఆఖరి మ్యాచ్లో టీమిండియా 42 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 167 పరుగులు చేసింది. సంజూ శాంసన్(45 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. శివమ్ దూబే(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 26) మెరుపులు మెరిపించాడు.

జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబని రెండు వికెట్లు తీయగా.. సికందర్ రాజా, బ్రాండన్ మవుతా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన జింబాబ్వే ముఖేష్ కుమార్ ధాటికి 125 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బ్యాటర్లలో డియోన్ మైర్స్(32 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 34), మరుమని(24 బంతుల్లో 5 ఫోర్లతో 27), ఫరాజ్ అక్రమ్(13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 27) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ నాలుగు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. శివమ్ దూబే(2/25) రెండు వికెట్లు తీసాడు.ఈ గెలుపుతో టీమిండియా 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ విజయానంతరం మాట్లాడిన శుభ్మన్ గిల్.. సహచర ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు.
'ఇదో అద్భుతమైన సిరీస్. తొలి మ్యాచ్లో ఓటమి తర్వాత మా కుర్రాళ్లు నేలకు కొట్టిన బంతిలా పుంజుకున్నారు. ఈ సిరీస్లో మా జట్టు ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చింది. ఎందుకంటే మా జట్టులో చాలా మంది ఆటగాళ్లకు విదేశాల్లో ఆడిన అనుభవం లేదు. అయినప్పటికి వారు అద్భుతంగా ఆడారు. వారి ప్రదర్శన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. తదుపరి శ్రీలంక పర్యటన కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను. గతంలో ఆసియా కప్ కోసం శ్రీలంకకు వెళ్లాను. అక్కడ ఆడిన అనుభవం ఉంది.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.