ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా వైఫల్యం కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ టీమిండియా ఓటమిపాలైంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆసీస్ 2 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. ఈ గెలుపుతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే కీలక క్యాచ్లు వదిలేయడంతోనే ఓటమిపాలయ్యామని టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. మ్యాచ్ అనంతరం అధికార బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన శుభ్మన్ గిల్.. టాస్ ఓడిపోవడం పెద్దగా ప్రభావం చూపలేదన్నాడు.
'మేం పోరాడే లక్ష్యాన్నే నమోదు చేశాం. కానీ కీలక క్యాచ్లు వదిలేస్తే ఎంత పెద్ద లక్ష్యం ఉన్నా కాపాడుకోలేం. తొలి మ్యాచ్లో టాస్ గెలవడం కీలకం. కానీ ఈ మ్యాచ్లో టాస్ అంత కీలకం కాదు. ఎందుకంటే ఇరు జట్లు 50 ఓవర్లు ఆడాయి. 15-20 ఓవర్ల తర్వాత వికెట్ సెటిల్ అయ్యింది. రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం అంత సులువు కాదు. మ్యాచ్ ఆరంభంలో పిచ్ బ్యాటింగ్కు సవాలుగా ఉంది. కానీ రోహిత్ అద్భుతంగా ఆడాడు. నా అభిప్రాయం ప్రకారం అతను పెద్ద ఇన్నింగ్స్ను చేజార్చుకున్నాడు.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్లో టీమిండియా మూడు కీలక క్యాచ్లు నేలపాలు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మాథ్యూ షార్ట్ ఇచ్చిన క్యాచ్ను అక్షర్ పటేల్ నేలపాలు చేశాడు. 55 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో సిరాజ్ క్యాచ్ నేలపాలు చేశాడు. అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ట్రావిస్ హెడ్ ఇచ్చిన క్యాచ్ను నితీష్ కుమార్ రెడ్డి వదిలేసాడు. ఈ మూడు క్యాచ్లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. రెండు అవకాశాలతో మాథ్యూ షార్ట్ చెలరేగాడు. 74 పరుగులతో భారత్ పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(97 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 73), శ్రేయస్ అయ్యర్(77 బంతుల్లో 7 ఫోర్లతో 61) హాఫ్ సెంచరీలతో రాణించగా.. అక్షర్ పటేల్(41 బంతుల్లో 5 ఫోర్లతో 44), హర్షిత్ రాణా(18 బంతుల్లో 3 ఫోర్లతో 24 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ(0) మరోసారి తీవ్రంగా నిరాశపర్చాడు.
అనంతరం ఆస్ట్రేలియా46.2 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసి గెలుపొందింది. మాథ్యూ షార్ట్(78 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 74), కూపర్ కన్నోల్లీ(51 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.