పేలవ బ్యాటింగ్తోనే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూశామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. మంగళవారం చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన సీఎస్కే 63 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన శుభ్మన్ గిల్.. చెన్నై సూపర్ కింగ్స్ అసాధారణ ప్రదర్శన కనబర్చిందని కొనియాడాడు. బ్యాటింగ్, బౌలింగ్లో తమ కంటే మెరుగైన ప్రదర్శన చేసిందన్నాడు.

'చెన్నై సూపర్ కింగ్స్ అసాధారణ ప్రదర్శన కనబర్చింది. బ్యాటింగ్, బౌలింగ్లో వారి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేశారు. పవర్ ప్లేలో మెరుగైన ప్రదర్శన చేసేందుకు మేం ప్రయత్నించాం. కానీ ఆశించిన పరుగులు చేయలేకపోయాం. దాంతో ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశాం. బౌలింగ్లోనూ 10-15 పరుగులు అదనంగా ఇచ్చాం.
కొన్ని బౌండరీలను ఆపలేకపోయాం. అయినా.. ఈ మ్యాచ్లో 190-200 పరుగుల లక్ష్యాన్ని చేధించగలమని భావించాం. టోర్నీ ఆరంభంలోనే ఇలాంటి పరాజయాలు ఎదురవ్వడం మాకు కలిసొచ్చే అంశం. మా తప్పిదాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తోంది. ఈ మ్యాచ్లో ఓడినా.. ఈ పరాజయం మాకు ఓ గుణపాఠం.
చెన్నై విధించిన లక్ష్యం చేధించదగినదే. పిచ్ కూడా బాగానే ఉంది. కానీ మేం బ్యాటింగ్లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాం. కెప్టెన్గా నాకు ఇవన్నీ నేర్చుకునే విషయాలే. అనుభవాలే. గత రెండు సీజన్లలో ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్ వంటి జట్టుకు సారథ్య వహించడం చాలా సంతోషంగా ఉంది.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది. శివమ్ దూబే( 23 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్లతో 51) విధ్వంసకర హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులే చేసి ఓటమిపాలైంది. సాయి సుదర్శన్(31 బంతుల్లో 3 ఫోర్లతో 37) మినహా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.