తమ బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన సన్రైజర్స్ హైదరాబాద్పై భారీ విజయం సాధించామని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఆదివారం సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో సమష్టిగా చెలరేగిన గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై గెలుపొందింది.
ఈ మ్యాచ్ అనంతరం తమ విజయంపై స్పందించిన శుభ్మన్ గిల్.. తమ బౌలర్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'సొంతగడ్డపై రెండు మ్యాచ్లు గెలవడం గొప్పగా ఉంది. ముందు ముందు టోర్నీలో మేం ఇదే జోరును కొనసాగిస్తామని ఆశిస్తున్నా. మిడిల్ ఓవర్లలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా నూర్ అహ్మద్, వరల్డ్ క్లాస్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అసాధారణ ప్రదర్శన కనబర్చారు.

దర్శన నల్కండే కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. మోహిత్ శర్మ తన అనుభవాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. తనకు అచ్చొచ్చిన వికెట్పై యార్కర్స్, స్లోయర్ బాల్స్తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. కొత్త బంతితో పరుగులు చేయడం చాలా సులువైంది. దాంతో స్లోయర్ బాల్స్ను లాంగర్ బౌండరీ సైడ్ హిట్ చేశాం.
ఊరించే బంతి రావడంతో భారీ షాట్ ఆడుదామనుకున్నాను. కానీ బంతి బ్యాట్ క్రింది భాగంలో తాకడంతో ఔటయ్యాను. టీ20ల్లో మన ఆప్షన్స్తో సిద్దంగా ఉండాలి. 160-170 పరుగులు మంచి స్కోర్ అని మేం భావించాం. ఈ క్రెడిట్ బౌలర్లందరిది. ప్రత్యర్థిని తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. జట్టులో ప్రతీ ఒక్కరికి తమ పాత్ర ఏంటో తెలుసు.
సాయి సుదర్శన్, వృద్దిమాన్ సాహా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. మిల్లర్ ఫామ్లోకి వచ్చాడు. అతనికి ఎలాంటి గాయం కాలేదు. ఉక్కపోత వాతావరణం కావడంతో తిమ్మిర్లు వచ్చాయి అంతే.'అని శుభ్మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ(29), అబ్దుల్ సమద్(29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ మూడు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా, ఉమేశ్ యాద్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 168 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్(27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 44 నాటౌట్) సాయి సుదర్శన్(45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్రైజర్స్ బౌలర్లలో షెహ్బాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీసారు.