ఇంగ్లండ్తో ఆఖరి టెస్ట్లో టీమిండియా తడబడుతోంది. ఓవల్ వేదికగా గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 83 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు యశస్వి జైస్వాల్(2), కేఎల్ రాహుల్(14) పెవిలియన్ చేరారు. అట్కిన్సన్ బౌలింగ్లో జైస్వాల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగ్గా.. క్రిస్ వోక్స్ బౌలింగ్లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడారు. వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపేసిన అంపైర్లు.. నిర్ణీత సమయం కన్నా ముందే లంచ్ బ్రేక్ ప్రకటించారు. ఆ తర్వాత వర్షం దాగుడు మూతలు ఆడటంతో ఆలస్యం మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది.
రెండో సెషన్ ఆరంభంలోనే లేని పరుగుకు ప్రయత్నించి శుభ్మన్ గిల్ రనౌట్గా వెనుదిరిగాడు. బౌలర్ చేతిలోకే బంతిని కొట్టి గిల్ క్విక్ సింగిల్కు ప్రయత్నించాడు. సాయి సుదర్శన్ వద్దని చెప్పడంతో గిల్ యూటర్న్ తీసుకోగా.. బంతిని అందుకున్న అట్కిన్సన్ నేరుగా వికెట్లను హిట్ చేశాడు. దాంతో శుభ్మన్ గిల్(21) పెవిలియన్ చేరాడు. అట్కిన్సన్ వేసిన 28వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఓవర్ రెండో బంతిని అట్కిన్సన్ ఆఫ్ స్టంప్ లైన్లో వేయగా.. గిల్ డిఫెన్స్ చేసి క్విక్ సింగిల్కు ప్రయత్నించాడు. బంతి నేరుగా అట్కిన్సన్ చేతులకు వెళ్లడం.. రన్ వద్దంటూ సాయి సుదర్శన్ అరవడంతో గిల్ యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ తీసుకునే క్రమంలో అతను స్లిప్ అయ్యాడు.
మరోవైపు బంతిని అందుకున్న అట్కిన్సన్ ఏ తప్పు చేయకుండా రనౌట్ చేశాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 44 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఈ రనౌట్ టీమిండియాకు తీవ్ర నష్టం చేయనుంది. శుభ్మన్ గిల్ అలసత్వం జట్టు కొంపముంచింది. గిల్పై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. సూసైడల్ రనౌట్ అంటూ విమర్శించాడు. సగం పిచ్ నుంచి క్రీజులో రాలేకపోయిన గిల్.. సాయి సుదర్శన్ పరుగు ఎలా పూర్తి చేస్తాడనుకున్నాడని ప్రశ్నించాడు.
క్రీజులోకి కరుణ్ నాయర్ రాగా.. మళ్లీ వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 29 ఓవర్లలో 3 వికెట్లకు 85 పరుగులు చేసింది. వర్షం భారీగా పడటం, ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో దాదాపు రెండు గంటల పాటు ఆటకు అంతరాయం కలిగింది. అనంతరం రెండో సెషన్ను ముగించిన అంపైర్లు ఆఖరి సెషన్ను మొదలుపెట్టారు.
సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ నిలకడగా రాణించే ప్రయత్నం చేశారు. కానీ సాయి సుదర్శన్(38)ను జోష్ టంగ్ కీపర్ క్యాచ్గా పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే రవీంద్ర జడేజా(9) టంగ్ బౌలింగ్లోనే వెనుదిరిగాడు. ధ్రువ్ జురెల్ సైతం(19) నిరాశపర్చాడు. క్రీజులోకి వచ్చిన సుందర్, కరుణ్ నాయర్ పోరాడుతున్నారు.