ఆస్ట్రేలియాతో నాలుగో టీ20లో భారత బ్యాటర్లు తడబడ్డారు. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్(39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 46) జిడ్డు బ్యాటింగ్తో విసిగించడంతో టీమిండియా 168 పరుగుల సాధారణ లక్ష్యం నమోదు చేసింది. నాథన్ ఎల్లిస్(3/21), ఆడమ్ జంపా(3/45) మూడేసి వికెట్లతో భారత పతనాన్ని శాసించారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులే చేసింది.
అభిషేక్ శర్మ(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28), శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, సిక్స్తో 23), సూర్యకుమార్ యాదవ్(10 బంతుల్లో 2 సిక్స్లతో 20) దూకుడుగా ఆడే క్రమంలో వికెట్లు పారేసుకున్నారు. చివర్లో అక్షర్ పటేల్(11 బంతుల్లో ఫోర్, సిక్స్తో 21 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత్ 160 పరుగుల మార్క్ ధాటింది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్లెట్, మార్కస్ స్టోయినిస్ చెరో వికెట్ పడగొట్టారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు మెరుగైన ఆరంభమే దక్కింది. కానీ తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ ఇచ్చిన సునాయస క్యాచ్ను గ్జేవియర్ బార్ట్లెట్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ ఆసీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అభిషేక్ తనదైన శైలిలో పరుగులు రాబట్టలేకపోయాడు. మరోవైపు పేలవ ఫామ్ ఒత్తిడితో శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో భారత్ 49 పరుగులే చేసింది.
ఆడమ్ జంపా బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన అభిషేక్ శర్మ అదే ఓవర్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 56 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. బ్యాటింగ్ అవకాశం ఇవ్వాలని శివమ్ దూబేను ఫస్ట్ డౌన్లో పంపించగా అతను జాగ్రత్తగా ఆడాడు. క్రీజలో సెట్ అయిన శుభ్మన్ గిల్ కూడా ఆచితూచి ఆడటంతో పరుగుల వేగం తగ్గింది. దాంతో ఒత్తిడికి గురైన శివమ్ దూబే ఎదురు దాడికి దిగాడు. ఆడమ్ జంపా బౌలింగ్లో భారీ సిక్సర్ బాది జోరు కనబర్చినప్పటికీ.. అతన్ని నాథన్ ఎల్లిస్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
కెప్టెన్ సూర్య వచ్చిరావడంతో జంపా బౌలింగ్లో వరుసగా రెండు భారీ సిక్స్లు బాదాడు. అప్పటి వరకు నిదానంగా ఆడిన శుభ్మన్ గిల్ కూడా భారీ సిక్సర్ బాది హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. కానీ నాథన్ ఎల్లిస్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 39 బంతులాడిన గిల్.. 46 పరుగులే చేశాడు. అతని స్లో బ్యాటింగ్ ఇతర బ్యాటర్లపై ప్రభావం చూపింది.
తిలక్ వర్మ(5), జితేశ్ శర్మ(6) అంచనాలు అందుకోకపోగా.. వాషింగ్టన్ సుందర్(12), అర్ష్దీప్ సింగ్(0) తీవ్రంగా నిరాశపర్చారు. వరుణ్ చక్రవర్తీ సాయంతో అక్షర్ పటేల్(21 నాటౌట్) దూకుడుగా ఆడి పోరాడే లక్ష్యాన్ని అందించాడు. శుభ్మన్ గిల్ కాస్త వేగంగా ఆడి ఉంటే టీమిండియా మరో 10-20 పరుగులు అదనంగా చేసి ఉండేది.