టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పు తర్వాత శుభ్మన్ గిల్ తొలిసారి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను కలుసుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు న్యూఢిల్లీ విమానాశ్రయంలో గిల్.. రోహిత్ను పలికరించాడు. వెంటనే రోహిత్.. 'అరె గిల్.. ఎట్లున్నావ్ బ్రదర్'అంటూ రియాక్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది కెప్టెన్, మాజీ కెప్టెన్ మధ్య ఉన్న రిలేషన్ అని కామెంట్ చేస్తున్నారు. క్యూటెస్ట్ వీడియో అంటూ క్యాప్షన్ ఇస్తున్నారు.
మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియా బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది. భారత ఆటగాళ్లంతా ఢిల్లీ విమానాశ్రయంలోనే కలుసుకున్నారు. ముందుగా వన్డే సిరీస్ జరగనుండగా.. అక్టోబర్ 19న పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. టీమిండియా వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా జట్టుతో కలిసి ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కారు. ఈ సిరీస్లో టీమిండియాను శుభ్మన్ గిల్ నడిపించనుండగా..కోహ్లీ, రోహిత్లు అతని సారథ్యంలో ఆడనున్నారు.

ఐపీఎల్ 2025 సీజన్ తర్వాత కోహ్లీ, రోహిత్ మైదానంలోకి బరిలోకి దిగుతుండటం ఇదే తొలిసారి కావడంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ, రోహిత్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. ఈ మూడు వన్డే మ్యాచ్ల్లో కనబర్చే ప్రదర్శనపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ సిరీస్లో విఫలమైతే వారికి వారే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ 2027 టోర్నీని దృష్టిలో పెట్టుకొనే కెప్టెన్సీ మార్పు చేశామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు.
మెగా టోర్నీకి మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. అప్పటికి రోహిత్ శర్మ వయసు 40 ఏళ్లకు చేరుతుంది. ఆ వయసులో ఆడటం కష్టమనే అభిప్రాయం నెలకొంది. ఈ క్రమంలోనే అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. మరోవైపు రోహిత్ శర్మ మాత్రం వన్డే ప్రపంచకప్ గెలిచే ఆట నుంచి తప్పుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.