టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టులో కొనసాగుతారని కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పష్టం చేశాడు. వన్డే ప్రపంచకప్ 2027 లక్ష్యంగా వారి సన్నద్ధత కొనసాగుతోందని తెలిపాడు. వారి అనుభవం తమకు అవసరమని తెలిపాడు. వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తొలగించి శుభ్మన్ గిల్ను నయా సారథిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
వన్డే ప్రపంచకప్ 2027ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. దాంతో కోహ్లీ, రోహిత్ వన్డే ప్రపంచకప్ ఆడటంపై సందేహాలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం ఈ ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. గురువారం నుంచి వెస్టిండీస్తో రెండో టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో శుభ్మన్ గిల్ బుధవారం మీడియాతో మాట్లాడాడు.

ఈ సందర్భంగా వన్డే సారథ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మలా ప్రశాంతంగా ఉంటూ.. జట్టులో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని సృష్టిస్తానని తెలిపాడు. 'రోహిత్ శర్మ చాలా కూల్గా ఉంటాడు. కెప్టెన్గా అతను జట్టులో నెలకొల్పిన స్నేహపూర్వక వాతావరణాన్ని సారథిగా నేను కొనసాగిస్తా. చాలా మంది బయటి నుంచి చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. రోహిత్, విరాట్ ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్నారు.
వారిద్దరి భవితవ్యంపై కూడా ఊహాగానాలు వస్తున్నాయి. టీమిండియా కోసం ఎన్నో మ్యాచ్లు గెలిపించారు. వీరిద్దరూ అద్భుతమైన నైపుణ్యం కలిగిన క్రికెటర్లు. జట్టుకు వారి అవసరం చాలా ఉంది. వచ్చే వన్డే ప్రపంచ కప్ లక్ష్యంగా వారి సన్నద్ధత జరుగుతోంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. నేను కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అయితే నేనెప్పుడూ వర్తమానంలో ఉండేందుకు ఇష్టపడుతా. అలాగే తంలో సాధించిన విజయాలు పట్టించుకోను. ప్రతీ మ్యాచ్లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో ముందుకుసాగుతాం. రాబోయే కొన్ని నెలలు మాకు చాలా ముఖ్యం.'అని గిల్ చెప్పుకొచ్చాడు.
వెస్టిండీస్తో తొలి టెస్ట్లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్ట్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటుంది. ఈ మ్యాచ్ గెలిచి రెండు టెస్ట్ల సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు రెండో టెస్ట్లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుందని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. బుమ్రాకు రెస్ట్ ఇస్తారని ప్రచారం జరగ్గా.. ఈ వార్తలను అతను ఖండించాడు.